'సచిన్ దత్తత గ్రామం పుత్తంరాజు కండ్రిగలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం'
అమరావతి: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ దత్తత గ్రామంలో ఆక్సిజన్ సర్వీస్ కంపెనీ ప్రతినిధులు శుక్రవారం పర్యటించి గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. వివరాల్లోకి వెళితే ఏపీలోని నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలోని పుత్తంరాజు కండ్రిగ అనే గ్రామాన్ని సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే పలుమార్లు ఈ గ్రామంలో పర్యటించిన సచిన్ టెండూల్కర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అయితే తాజాగా తాను దత్తత తీసుకున్న గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని తాను బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహారిస్తున్న ఆక్సిజన్ సర్వీస్ కంపెనీ యాజమాన్యాన్ని కోరారు.
సచిన్ కోరిక మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు శుక్రవారం నెల్లూరు వచ్చి గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్తో సంప్రదింపులు జరిపారు. అనంతరం కంపెనీ ప్రతినిధులు రాజ్పాల్ సింగ్, శ్రీనివాసరావులను సచిన్ ప్రతినిధి నారాయణ్ గూడూరుకు తీసుకొచ్చి సబ్ కలెక్టర్ కార్యాలయంలో గ్రామానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ పుత్తంరాజు కండ్రిగ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నట్టు చెప్పారు. గ్రామంలోని ఆసుపత్రి సౌకర్యంతో పాటు మహిళకు ఉపాధి కల్పనకు వారికి స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇవ్వనున్నట్టు వారు తెలిపారు.
దీంతో పాటు గ్రామానికి సంబంధించిన వారి కోసం పట్టణ ప్రాంతానికి బ్యాంకింగ్ సేవల కోసం వెళ్లకుండా ఒక వ్యక్తిని అక్కడ బ్యాంకు ప్రతినిధిగా నియమించి అవసరమైన వారికి బ్యాంకింగ్ సేవలను గ్రామంలోనే అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.