ఏపీ శ్రీలంక కాక తప్పదు-ఆర్ధికపరిస్ధితిపై లోతుగా పరిశీలించాల్సిందే-పయ్యావుల కామెంట్స్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఆర్ధిక అక్రమాలపై ఇప్పటికే పలుమార్లు విమర్శలు చేసిన పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్.. తాజాగా కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలతో ఈ అంశంపై మరోసారి స్పందించారు. కేంద్రం ఇప్పుడు చెబుతోందని,తాము ఎప్పుడో చెప్పామని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన చురకలు అంటించారు.
దేశంలో పది రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే దిశగా సాగుతోందని కేంద్రం పార్లమెంటులో అన్ని పార్టీలకు సంబంధించిన నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరించడం బాధాకరమని టీడీపీ నేత పయ్యావుల అన్నారు.నాలుగు నెలల క్రితం టీడీపీ నేతలు ఏం చెప్పామో అదే ఇప్పుడు కేంద్రం చెప్పిందన్నారు. ఏపీ రాష్ట్ర పరిస్థితి శ్రీలంక దిశగా సాగుతుందని, కేంద్రం కూడా చెప్పే పరిస్థితికి వచ్చిందన్నారు.
శ్రీలంక ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు అంచన వేయడం కోసం కేంద్రం ఆర్థిక శాఖను, ఆర్బీఐ ని ఆదేశించిందని పయ్యావుల గుర్తుచేశారు. వాళ్ళు రిస్క్ ఎనాలసిస్ ని తయారు చేస్తూ ఒక నివేదికను కేంద్రం ఆర్థిక శాఖకు పంపారన్నారు. ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర ఆర్థిక శాఖ మరొక నివేదికని తయారు చేసిందన్నారు. ఆ నివేదికలో శ్రీలంక ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తున్న రాష్ట్రాలు ఏవని గుర్తించింది. ఈ నివేదికని ప్రధానంగా ఇంటర్ నేషనల్ మానిటర్ ఫండ్ సూచనల మేరకు రిస్క్ ఎనాలసిస్ చేశారన్నారు.
ఆర్బీఐ ఇదంతా కేంద్రం ఒత్తిడితో, ప్రతి పక్ష పార్టీల ఒత్తిడితో చేసింది కాదని పయ్యావుల తెలిపారు. వాళ్ళు ఇచ్చిన పది నివేదికలలో దాదాపు అన్నింటిలోను ఆంధ్రప్రదేశ్ ఒకటి రెండు స్థానాలు మారుతూ మొదటి స్థానంలోనే ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత తీవ్రంగా సంక్షోభం దిశగా వెళుతోందనే దానికి ఉదాహరణ ఈ నివేదికేనన్నారు. రుణ పరిమితి దాటిందని, ద్రవ్యోల్బణం రేటు అధికంగా ఉందని పయ్యావుల తెలిపారు. ఆదాయానికి అప్పులకి ఉన్న పరిమితికి ఎక్కడా సమతుల్యత లేదన్నారు.
దాదాపు 50వేల కోట్ల రూపాయల అప్పులకు సంబంధించిన ఖాతా వివరాలు పంపించలేదని, దాచిన లెక్కలని బయటకు తీయాల్సిన బాధ్యత సి.ఏ.జీలకు ఉందని పయ్యావుల తెలిపారు. వాళ్ళు గత సంవత్సరం సంతకం పెట్టేటపుడు దేశంలోనే ఏ రాష్ట్రానికి ఇవ్వని క్వాలిఫైడ్ సర్టిఫికెట్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారన్నారు. ఈ సంవత్సరం కూడ అకౌంటుకి సంబంధించి సంతకం పెట్టారన్నారు. ఆడిట్ ఆఫీసర్లు మాకు అందిన సమాచారం ఇది, మాకు అందని సమాచారం ఎంతో ఉందని ఎక్కడో చిన్న అక్షరాలలో రాశారన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై లోతైన అధ్యయనం జరగాలన్నారు. శ్రీలంక అప్పులతోటి కుప్ప కూలి పోయిందంటే శ్రీలంక కంటే ఆంధ్రప్రదేశ్ 4రెట్లు ఎక్కువ అప్పు చేసిందని, కనుక సంక్షోభం దిశగా వెళ్లామని పయ్యావుల గుర్తుచేశారు. శ్రీలంక సంక్షోభంలో ఉంటే ఇబ్బంది పడుతున్నది రాజ పక్స కుటుంబం, గొటబాయ కుటుంబం, పాలకులు కాదు అక్కడ ఉన్న సామాన్య ప్రజలు. పారిపోయిన విజయమాల్య, గొటబాయ కుటుంబంలాగా ఆర్థిక సంక్షోభం వస్తే ఈ పాలకులు ఏటో పారిపోతారన్నారు.