టీడీపీ ఎమ్మెల్యే పెద్ద మనసు
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తన పెద్ద మనసు చాటుకున్నారు. యలమంచిలి మండలం పెనుమర్రుకు చెందిన లక్ష్మీభవానీ ప్రసవ వేదనతో ఉండగా కుటుంబ సభ్యులు శుక్రవారం అర్ధరాత్రి పాలకొల్లు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో గైనకాలజిస్టు అందుబాటులో లేరు. దీంతో సిబ్బంది వారిని వేరేచోటకు వెళ్లాలని సూచించారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఏమి చేయాలో అర్థంకాక కుటుంబసభ్యులు అయోమయానికి గురయ్యారు.
ఈ విషయాన్ని కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆ సమయంలో వెంటనే ఆసుపత్రికి వచ్చారు. బయట నుంచి గైనకాలజిస్టు, మత్తు వైద్యుడిని పిలిపించి వైద్యసేవలు అందేలా చూశారు. అనంతరం లక్ష్మీభవాని పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఎమ్మెల్యే చేసిన సహాయానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. తల్లి బిడ్డలను చూసి 'మీ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని' ఎమ్మెల్యే రామానాయుడు వ్యాఖ్యానించారు. పేదలకు వైద్య సేవలందించాలని టీడీపీ ప్రభుత్వ హయాంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని, కానీ వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పనులు పడకేశాయన్నారు.

పాలకొల్లు ఎమ్మెల్యేగా 2024 ఎన్నికల్లో కూడా పోటీచేయడానికి నిమ్మల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉండటానికి ఇప్పటికే ఆయన సైకిల్ యాత్ర నిర్వహించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలను సైకిల్ పై చుట్టిరావడమే కాకుండా స్థానికంగా పేరుకుపోయిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications