తిరుమలలో మైసూరు మహారాజు సమక్షంలో..
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం నాడు 90,326 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 30,099 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.33 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి షెడ్ల వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 14 నుంచి 16 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

తిరుమలలో సోమవారంనాడు శ్రీవారి పల్లవోత్సవం ఘనంగా జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టీటీడీ ప్రతి సంవత్సరం ఈ పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సహస్ర దీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా తిరుమలలోని కర్ణాటక సత్రానికి వేంచేపు చేసి మైసూర్ సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు.
అనంతరం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు మలయప్ప స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మైసూరు మహారాజు, భారతీయ జనత పార్టీకి చెందిన మైసూరు-కొడగు లోక్ సభ సభ్యుడు యదువీర కృష్ణ దత్త చామరాజ వడియార్, రాజమాత ప్రమోదా దేవి వడియార్ ఇందులో పాల్గొన్నారు. మలయప్ప స్వామివారికి పూజలు నిర్వహించారు.
అంతకుముందు యదువీర కృష్ణదత్త, రాజమాత ప్రమోదా దేవి శ్రీవారిని దర్శించుకున్నారు. సేవల్లో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో గల రంగనాయకుల వారి మండపంలో టీటీడీ అర్చకులు వారికి వేదాశీర్వచనాలను పలికారు. స్వామివారి శేషవస్త్రాన్ని బహూకరించారు. తీర్థప్రసాదాలను అందించారు.
శ్రీవారి పల్లవోత్సవం కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి, నరేష్, డిప్యూటీ ఈవో లోకనాథం,పేష్కార్ రామకృష్ణ, పాల్గొన్నారు. కర్ణాటక సత్రంలో ఉన్న ఆ రాష్ట్ర భక్తులు పెద్ద సంఖ్యలో మలయప్ప స్వామివారిని దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications