రాజీనామా అనంతరం బీజేపీపై అన్నామలై మొదటి భారీ దాడి
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష రద్దు, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, ఈ నెల 21న రీటెస్ట్ భద్రతా ఏర్పాట్లపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కఠినమైన నిఘా చర్యలు విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కిందటి నెల 3న జరిగిన నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రాల లీకేజీ, ఇతర అక్రమాలు వెలుగుచూడటంతో కేంద్ర ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 21న రీటెస్ట్ నిర్వహించనుంది. ఎలాంటి అక్రమాలు జరగకుండా దీన్ని నిర్వహించేందుకు కేంద్ర విద్యాశాఖ, జాతీయ పరీక్షల సంస్థ (NTA) భారీ భద్రతా చర్యలు చేపట్టాయి. ఈ చర్యలు అసంబద్ధంగా ఉన్నాయని, విద్యార్థులను మరింత భారంగా మారుతున్నాని అన్నామలై స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఎక్స్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం పరీక్ష నిర్వహణను యుద్ధ వాతావరణంగా మార్చిందని అన్నామలై ఆరోపించారు. సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, పరీక్షా కేంద్రాల వద్ద రెండంచెల రక్షణ, ఐఏఎఫ్ ఎయిర్లిఫ్ట్ తనిఖీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నాలుగు అంచెల సీసీటీవీల నిఘా, ప్రవేశ ద్వారాల వద్ద ఫేషియల్ రికగ్నిషన్, ప్రధాని కార్యాలయం ప్రత్యక్ష పర్యవేక్షణ వంటి ఏర్పాట్లను ఆయన ఎత్తిచూపారు. వీటి పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
Two-tier CRPF+CISF escort with IAF airlift.
— K.Annamalai (@annamalai_k) June 16, 2026
4-layer CCTV with AI surveillance.
Biometric & facial recognition before entry.
Multiple layers of frisking.
Multi-level oversight with direct monitoring from the Prime Minister’s office.
Yes, you read it right. But these are…
ఇవన్నీ దేశ రక్షణకు ఉపయోగించే అత్యంత రహస్యమైన మిలిటరీ క్లాసిఫైడ్ సాఫ్ట్వేర్ కొనుగోలుకు చేసిన ఏర్పాట్లు కావని, ఓ రీటెస్ట్ కోసం చేసినవని అన్నామలై ఎద్దేవా చేశారు. పరీక్షా సమయాన్ని 180 నిమిషాల నుంచి 195 నిమిషాలకు పెంచడం, సుదీర్ఘ తనిఖీల ప్రక్రియ విద్యార్థులను భావోద్వేగంగా దెబ్బతీస్తుందని, ఇది పరీక్షల భయాన్ని తగ్గించాలనే జాతీయ విద్యా విధానం స్ఫూర్తికే విరుద్ధమని విమర్శించారు.
మరోవైపు, పరీక్షకు కొద్ది రోజులే సమయం ఉన్నప్పటికీ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలపై అన్నామలై అసంతృప్తి వ్యక్తం చేశారు. భద్రతకు ఇచ్చిన ప్రాధాన్యతను ప్రాథమిక అవసరాల కల్పనపై పెట్టకపోవడాన్ని ఆక్షేపించారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇంకా అనేక సవాల్లు అలాగే మిగిలిపోయాయని ఆయన గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications