జగన్ తీవ్రవాద మనస్తత్వం: పల్లె, తాత్కాలిక అసెంబ్లీ చూశాక: కోడెల
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు రానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం... ఆయన తీవ్రవాద మనస్తత్వానికి అద్దం పడుతోందని ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు.
అమరావతి శంకుస్థాపనకు రానని జగన్ చెప్పడం ప్రజలను అవమానించడమేనన్నారు. జగన్కు ఇంకా రాజకీయ పరిణితి రాలేదన్నారు. జగన్ను ఆహ్వానిస్తామని చెప్పారు. జగన్ రాకపోవడం తెలుగు ప్రజలను అవమానించడం కూడా అని అభిప్రాయపడ్డారు. కరడుగట్టిన ఫ్యాక్షన్ వైఖరి అని, జగన్ వైఖరి ఎలా ఉన్నా ఆహ్వానిస్తామన్నారు.
మన మట్టి-మన నీరు కార్యక్రమంలో ఎమ్మెల్సీ జనార్దన్
కృష్ణా జిల్లా వత్సవాయి మండలం లింగాల గ్రామంలో మన మట్టి-మన నీరు కార్యక్రమంలో టిడిపి ఎమ్మెల్సీ టిడి జనార్దన్ పాల్గొన్నారు. గ్రామంలో మేళతాళాలతో పురవీధుల్లో తిరిగి రాజధాని నిర్మాణం కోసం సేకరించిన మట్టి, నీరుకు పూజ చేశారు. రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు.

'అమరావతి' ఏర్పాట్లను పరిశీలించిన చదలవాడ
అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఏడుకొండల నుంచి సేకరించిన పుణ్యతీర్థాలను తీసుకురానున్నట్లు టిటిడి పాలకమండలి అధ్యక్షులు చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. ఉద్ధండ్రాయుని పాలెంలో అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు.
భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అమరావతి నిర్మాణానికి టిటిడి తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. అనంతవరం వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని టిటిడి పరిధిలోకి తీసుకురానున్నట్లు చదలవాడ కృష్ణమూర్తి స్పష్టం చేశారు.
ఆ తర్వాత ఆలోచిస్తాం: కోడెల
ఏపీలో అసెంబ్లీ తాత్కాలిక సమావేశాల పైన స్పీకర్, మండలి చైర్మన్ అధ్యక్షతన శుక్రవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా కోడెల మాట్లాడారు. ప్రభుత్వం అంగీకరిస్తే నవంబర్ 1లోగా నిర్మాణాలు పూర్తవుతాయన్నారు.
వృథా ఖర్చు కాకుండా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అఖిల పక్షాన్ని కోరామన్నారు. మొదటి, శీతాకాల బడ్జెట్ సమావేశాలు నిర్వహించి.. ఆ తర్వాత లోటుపాట్లను బట్టి తదుపరి సమావేశాలపై ఆలోచిస్తామన్నారు. తాత్కాలిక నిర్మాణాల పైన పదిరోజుల్లో ప్రతిపాదనలు ఇవ్వాలని నిర్మాణ కంపెనీలను కోరినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications