రాష్ట్రపతితో గవర్నర్ భేటీ, 'కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి'
అమరావతి: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్ బుధవారం మధ్యాహ్నాం రాష్ట్రపతి భవన్లో ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న తాజా రాజాకీయ పరిణామాలపై రాష్ట్రపతితో చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా రాష్ట్రపతికి నివేదిక సమర్పించారు. అలాగే సాయంత్రం 5.30 గంటలకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ కానున్నారు.
ఇక, ఏపీ సీఎం చంద్రబాబు కూడా రాష్ట్రపతితో సమావేశం కానున్నారు. అలాగే ప్రధాన మంత్రి మోడీతో పాటు, సాయంత్రం 4.30 గంటలకు రాజ్నాథ్ సింగ్తో ఆయన భేటీ కానున్నారు.
సాయంత్రం 5.30 గంటలకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో, 6.30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చంద్రబాబు సమావేశం అవుతారు.
కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి: పల్లె
ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ సీఎం కేసీఆర్ నోరు పారేసుకుంటున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని ఐటీ శాఖ మంత్రి పల్లె రఘనాథరెడ్డి సూచించారు. బుధవారం ఆయన హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంలో సీఎం చంద్రబాబు ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారని ప్రశ్నించారు.
ఒక సీఎంగా ఉంటూ మరో సీఎం ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి సహా 120 మంది ముఖ్య నాయకుల ఫోన్లు ట్యాప్ అయినట్లు తమకు ప్రాథమిక సమాచారం ఉందని తెలిపారు.
జగన్, కేసీఆర్ తెలుగు ప్రజల పాలిట రాహు, కేతువులాంటి వారని వ్యాఖ్యానించారు. ఇక ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్వవహారం కోర్టు పరిధిలో ఉన్నందున స్పందించబోనని అన్నారు.