విభజన వల్లే: పల్లె, మాఫీ చేస్తాం: ఏపీకి కేటీఆర్ కౌంటర్!
విశాఖ/హైదరాబాద్: విభజనతో ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగం వెనుకబడిందని ఆ రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథ రెడ్డి మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖను ఐటి హబ్గా మార్చుతామన్నారు. ఐటీ రంగంలో పెట్టుబడులకు విశాఖ నగరం చాలా అనుకూలమైన నగరమని చెప్పారు.
గతంలో ఐటీ కంపెనీలకు ఇచ్చిన భూములలో కంపెనీలు స్థాపించకుంటే వాటిని వెనక్కి తీసుకుంటామని చెప్పారు. రుషికొండ ఐటీ పార్కుకు నెలాఖరులోగా మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఐటీ పరిశ్రమల కోసం సింగిల్ విండో విధానం ప్రవేశ పెడతామని, నాలుగు వారాల్లో అనుమతి ఉంటుందన్నారు.
ఇప్పటికే నాలుగు వందల ఐటీ కంపెనీలకు ఆహ్వానం అందిందని చెప్పారు. రుషికొండ ఐటీ సెజ్ డీనోటిఫై చేసేందుకు పరిశీలన చేస్తున్నట్లు పల్లె రఘునాథ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ అభివృద్ధిని విశాఖ నుంచే మొదలుపెడతామన్నారు. విశాఖలో ఐటీ పరిశ్రమకోసం 330 ఎకరాలు కేటాయించామని తెలిపారు.
ఐటీ కంపెనీల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. నిబంధనల ప్రకారం ఉద్యోగాలు కల్పించకపోతే భూములు వెనక్కి తీసుకుంటామని వివరించారు. విశాఖ ఐటీ కేంద్రంగా మార్చేందుకు తెలుగుదేశం కట్టుబడి ఉందన్నారు. విశాఖలోని మధురవాడ, రిషికొండ ఐటీ సెజ్లను సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె మంగళవారం పరిశీలించారు.
మాఫీ చేస్తాం: కేటీఆర్
హైదరాబాదును దేశ ఆర్థిక రాజధానిగా చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. తాము రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయమని చెప్పారు. రైతుల రుణాలను తాము పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పారు. కాగా, ఏపీలో రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయనున్న నేపథ్యంలో.. కౌంటర్గా కేటీఆర్ తాము రీషెడ్యూల్ కాదని మాఫీ చేస్తామని చెప్పినట్లుగా కనిపిస్తోంది.