పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన టాటా ఏస్ వాహనం, 9 మంది మృతి
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని, తిరిగి రెంటచింతలకు వెళుతున్న ఓ టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం 9 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మరో ఐదుగురికి గాయాలు తగలడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిని గురజాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని సంతోషంగా వచ్చి వాహనంలో ఇంటికి తిరిగి ప్రయాణమైన క్రమంలో ఊహించని ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు తొమ్మిది మంది ప్రాణాలను హరించింది. శ్రీశైలం నుంచి తిరిగి వస్తున్న టాటా ఏస్ వాహనం రెంటచింతలలోని కరెంట్ ఆఫీస్ వద్ద ఆగివున్న లారీని ఢీ కొట్టింది.

విపరీతమైన వేగంతో వాహనం ఉన్న క్రమంలో లారీని ఢీ కొట్టిన వెంటనే వాహనం పల్టీ కొట్టింది. టాటా ఏస్ వాహనంలో క్రిక్కిరిసి వున్న జనం అంతా ఒకరిపై ఒకరు పడిపోయారు. తీవ్ర గాయాలపాలైన వారు హాహాకారాలు చేశారు. ఇక ఈ ఘటనలో అక్కడికక్కడే తొమ్మిది మంది మృతి చెందారు.

మిగతా వారందరూ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. మొత్తం టాటా ఏస్ వాహనంలో 38మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వీరంతా రెంటచింతల బీసీ కాలనీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. చీకటిగా ఉండటంతో, ఎదురుగా ఆగి ఉన్న లారీని డ్రైవర్ గమనించకపోవడం, వేగం రోడ్డు ప్రమాదానికి కారణాలుగా తెలుస్తున్నాయి. మృతి చెందిన వారిని పోస్ట్ మార్టం కోసం తరలిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.












Click it and Unblock the Notifications