తుపాకీ కాల్పులు.. టీడీపీ కీలక నేత మృతి
రొంపిచర్ల మండలంతోపాటు పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి వెన్నా బాలకోటిరెడ్డి కృషిచేశారు. ఇదే ఆయనకు శత్రువులను పెంచింది
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన రొంపిచర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటి రెడ్డి మృతి చెందారు. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 20 రోజులుగా ఆయన మృత్యువుతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. రొంపిచర్ల మండలంలోని అలవాల గ్రామంలో ఫిబ్రవరి ఒకటో తేదీ రాత్రి సమయంలో బాలకోటిరెడ్డి ఇంట్లో ఉండగా తుపాకీతో నిందితులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.

నరసరావుపేటలో చికిత్స
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలకోటి రెడ్డిని నరసరావుపేటలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు ఆపరేషన్ చేసి బుల్లెట్ ను బయటకు తీశారు. బుల్లెట్ బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పిందని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆరోగ్యం నెమ్మదిగా క్షీణిస్తుండటంతో గుంటూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్సనందించినప్పుటికీ వైద్యుల ప్రయత్నం ఫలించలేదు. బాలకోటిరెడ్డి కన్నుమూశారు. తెలుగుదేశం పార్టీ పల్నాడు ప్రాంతంలో కీలక నేతగా వ్యవహరిస్తున్న బాలకోటిరెడ్డి మండల అధ్యక్షుడిగా, ఎంపీపీగా, గ్రామ సర్పంచిగా పనిచేశారు. దివంగత కోడెల శివప్రసాద్ కు బాలకోటిరెడ్డి నమ్మినబంటు అనే పేరుంది.

పార్టీ బలోపేతం కోసం కృషి
రొంపిచర్ల మండలంతోపాటు పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషిచేశారు. ఇదే ఆయనకు శత్రువులను పెంచింది. అలవాల పంచాయితీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం,వైసీపీ వర్గాలు హోరాహోరీగా తలపడ్డాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించడంతో అప్పటి నుంచి గ్రామంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వర్గపోరు ప్రారంభమైంది. ఇలా కొనసాగుతున్న వర్గపోరుకు అలవాల తిరునాళ్ల ఆజ్యం పోసినట్లైంది. తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాలు రెండు ప్రజలను, వైసీపీకి చెందిన రెండువర్గాలు రెండు ప్రభలను కట్టారు. అక్కడ ఇరుపార్టీల నేతలమధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది.

నివురు గప్పిన నిప్పుులా...
అక్కడితో ఆ వివాదం సద్దుమణిగిందని అందరూ అనుకున్నప్పటికీ నివురు గప్పిన నిప్పులా పార్టీ రంగు పులుముకుంది. వివాదాలకు దారితీసింది. పార్టీల పరంగా వివాదాలు తగ్గినప్పటికీ ఆధిపత్య పోరు కోసం మాత్రం పోరు సాగుతూనే ఉంది. దీంతో తెలుగుదేశం, వైసీపీ వర్గాల మధ్య తరుచూ గొడవలు జరుగాయి. ఈ పోరులో భాగంగా ఆరునెలల వ్యవధిలో వెన్నా బాలకోటిరెడ్డిపై రెండుసార్లు దాడులు జరిగాయి. అయితే ఫిబ్రవరి ఒకటిన మాత్రం బాలకోటిరెడ్డి తప్పించుకోలేకపోయారు. ప్రత్యర్థుల తూటాలకు ఆయన బలవడం పల్నాడులో సంచలనం కలిగించింది.












Click it and Unblock the Notifications