అన్ రిజర్వ్డ్ పంచాయతీలు: కానీ బరిలో ఎస్సీ అభ్యర్థులు.. ఎలానంటే..
ఏపీలో పంచాయతీ ఎన్నిల్లో చిత్ర, విచిత్రాలు వెలుగుచూస్తున్నాయి. పంచాయతీ/ ఇతర ఎన్నికల్లో రిజర్వేషన్ తప్పనిసరి. ఆయా రిజర్వేషన్ల మేరకు సభ్యులు బరిలోకి నిలుస్తారు. సాధారణంగా చాలా పోటీ ఉంటుంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఎస్సీ/ ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా కాంపిటీషన్ ఉంది. కానీ ప్రకాశం జిల్లాలో కాస్త విచిత్ర సిచుయేషన్ ఏర్పడింది.
ప్రకాశం జిల్లా అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. రెండు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవి అన్రిజర్వ్డ్కు కేటాయించారు. కానీ.. ఆ గ్రామాల్లో ఓటర్లంతా ఎస్సీ సామాజికవర్గం వారే ఉన్నారు. దీంతో ఎస్సీలే బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అద్దంకి మండలం విప్పర్లవారిపాలెంలో మొత్తం 489 మంది ఓటర్లున్నారు. సర్పంచ్ పదవీ అన్రిజర్వ్డ్ మహిళకు కేటాయించారు. ఓటర్లందరూ ఎస్సీలే కావడంతో ఆ సామాజికవర్గానికి చెందిన మహిళలే బరిలో నిలుస్తున్నారు.
ఇక పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరు మండలం లక్కవరం గ్రామంలోని 647 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా కూడా ఎస్సీలే కావడం విశేషం. ఇక్కడా సర్పంచ్ పదవీని అన్రిజర్వ్డ్కు కేటాయించారు. కానీ ఎస్సీలే పోటీ చేస్తున్నారు. ఈ నెల 9న జరిగే ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎన్నిక జరగనుంది. అయితే ఆ రెండు గ్రామాల జనాభా గురించి ఎన్నికల కమిషన్ అంచనా వేయలేదా అనే అనుమానం కలుగుతోంది. ఎస్సీలే ఉంటే అన్ రిజర్వ్డ్ ఎలా కేటాయిస్తారు అని ప్రశ్నిస్తున్నారు.