కుక్కలను చంపాడని పంచాయతీ కార్యదర్శిపై కేసు
హైదరాబాద్: వీధి కుక్కలను చంపాడనే ఆరోపణపై హైదరాబాదులోని మీర్పేట పోలీసులు స్థానిక పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. విషం ఇచ్చి అతి కిరాకతంగా కుక్కలను చంపాడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
ప్రభాకర్ రెడ్డి పర్యవేక్షణలో కాంట్రాక్టు కార్మికులు సోమవారంనాడు విషం ఎక్కించి 25 వీధి శునకాలను చంపారని స్థానిక ఎంపిటిసి వి నరసింహ మీర్పేట పోలీసులకు మంగళవారంనాడు ఫిర్యాదు చేశారు. కుక్కల విషయంలో ప్రభాకర్ రెడ్డి తగిన మార్గదర్శకాలను పాటించలేదని నర్సింహ ఆరోపించారు.
ప్రభాకర్ రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు మీర్పేట ఇన్స్పెక్టర్ పి. శంకర్ యాదవ్ చెప్పారు. ప్రభాకర్ రెడ్డిపై ఐపిసి సెక్షన్ 428, తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఇటీవలి కాలంలో హైదరాబాదులో వీధికుక్కలు ప్రజలపై విపరీతంగా దాడి చేస్తున్నాయి. వీధిలో ఆడుకుంటున్న పిల్లలపై కూడా అవి దాడి చేసి దారుణంగా గాయపరిచిన సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి.