జగన్ సర్కార్ ముందు కొత్త డిమాండ్-సర్పంచ్ ల కిందకే సచివాలయాలు, వాలంటీర్లు ?
ఏపీలో ప్రభుత్వ పథకాలు గ్రామాల్లోని లబ్దిదారులకు పూర్తిస్ధాయిలో చేరే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ద అప్పటికే అమల్లో ఉన్న పంచాయతీ రాజ్ వ్యవస్ధకు పోటీగా తయారైంది. రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేసిన పంచాయతీ రాజ్ వ్యవస్ధను కాదని గ్రామ సచివాలయాలు,వాలంటీర్ల వ్యవస్ధను ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్పం.. నిధులతో సహా ప్రతీ విషయంలోనూ వాటికే ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో సర్పంచ్ ల వ్యవస్ధ నామమాత్రంగా తయారైంది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ముందుకు ఓ కీలక డిమాండ్ వచ్చింది.
సమాంతర వ్యవస్ధగా గ్రామ సచివాలయాలు
రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన పంచాయతీ రాజ్ వ్యవస్ధ ఉండగా...దానికి సమాంతరంగా వైసీపీ ప్రభుత్వం సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధను అమల్లోకి తెచ్చింది. దీంతో గ్రామాల్లో ప్రభుత్వ పథకాల పంపిణీ, ఇతరత్రా వ్యవహారాల్నీ సర్పంచ్ ల చేతుల్లో నుంచి సచివాలయాలకు చేరిపోయాయి. దీంతో సర్పంచ్ లు నామమాత్రంగా మిగిలిపోతున్నారు. గతంలో అన్ని అధికారాలతో గ్రామాల్లో పెత్తనం చెలాయించిన సర్పంచ్ లను ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో ఇతర పార్టీలతో పాటు వైసీపీ సర్పంచ్ లు కూడా రగిలిపోతున్నారు.
పంచాయతీరాజ్ ఛాంబర్ కొత్త డిమాండ్
ప్రస్తుతం పంచాయతీరాజ్ వ్యవస్ధ అమల్లో ఉండగా.. దానికి సమాంతరంగా తయారైన గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధపై సర్పంచ్ లు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే ఈ రెండు వ్యవస్ధల మధ్య అధికారాల విషయంలో హైకోర్టులోనూ పలు కేసులు నడిచాయి. చివరికి ప్రభుత్వం పలు మార్పులు కూడా చేయాల్సి వచ్చింది. అయినా ఇప్పటికీ సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. దీంతో ప్రతిష్టంభన తొలగించేందుకు పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రభుత్వం ముందుకు కొత్త డిమాండ్ తీసుకొచ్చింది.
సర్పంచ్ ల కిందకు సచివాలయాలు,వాలంటీర్లు
ప్రస్తుతం పంచాయతీరాజ్, సచివాలయ వ్యవస్ధల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సర్పంచ్ ల కిందకే గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధను తీసుకురావాలని పంచాయతీరాజ్ ఛాంబర్ తాజాగా డిమాండ్ చేసింది. విజయవాడలో తాజాగా నిర్వహించిన రెండు రోజుల సమావేశాల్లో ఛాంబర్ ఈ కీలక డిమాండ్ ను ప్రభుత్వం ముందు పెట్టింది. సర్పంచ్ ల ఆధ్వర్యంలో గ్రామ సచివాలయాలు, వాలంటీర్లను తీసుకొచ్చి పంచాయతీల ద్వారానే వీరికి జీతాలు, సెలవులు ఇచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని ఛాంబర్ కోరింది.
జగన్ వాలంటీర్లను ఇస్తారా ?
ఇప్పటికే వైసీపీ సర్కార్ గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ అందించే ప్రయత్నం చేస్తోంది. అలాగే వాలంటీర్లు అయితే మరో అడుగు ముందుకేసి ప్రతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి పూర్తి స్దాయిలో సహకరిస్తున్నారు. వీరిని పూర్తిస్దాయిలో అడ్డుకోవడం ఎవరి వల్లా కావడం లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో పంచాయతీ రాజ్ ఛాంబర్ డిమాండ్ ను ప్రభుత్వం అంగీకరించినా కేవలం సచివాలయాలు మాత్రమే సర్పంచ్ ల కిందకు వస్తాయి. కానీ వాలంటీర్ల వ్యవస్ధ మాత్రం అలాగే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.