చంద్రబాబు చెప్పారు, సాధ్యం కాదు: రాజధానిపై కమిటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణానికి అవసరమైన ప్రదేశాన్ని ఎంపిక చేయడం అంత సులువేమీ కాదని, కొన్ని ప్రాంతాల్లో అనువైన భూములు లభిస్తాయని కానీ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడకు వెళ్లినా భూముల ధరలు చాలా అధికంగా ఉన్నాయని, ఏపీలో ఆర్థికపరంగా అనేక ఇబ్బందులు ఉన్నాయని, అందువల్ల ప్రత్యేకంగా వసతులు కల్పించాలని కేంద్రానికి సూచించామని, దీనిపై త్వరలోనే కేంద్రం, కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించాల్సి ఉందని రాజధాని కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ వ్యాఖ్యానించారు.
శనివారం శివరామకృష్ణన్ కమిటీ విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో సుమారు 2 గంటలపాటు భేటీ అయింది. రాజధాని నిర్మాణానికి వివిధ ఆప్షన్లతో కూడిన నివేదికను ఆగస్టు మధ్యలో కేంద్రానికి అందజేస్తామన్నారు. తొలుత ఆయన ఏపీ సమగ్రాభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. వాస్తవానికి, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తనను ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధిపై అధ్యయనం చేసే కమిటీ చైర్మన్గా నియమించారని చెప్పారు.
కానీ, అందరూ దీనిని రాజధాని కమిటీగా పేర్కొంటున్నారన్నారు. హెడ్డింగ్ రాజధాని కమిటీ అని ఉండొచ్చునని కానీ, తమ కమిటీ మాత్రం సమగ్రాభివృద్ధి కోసం నియమించినదే అని స్పష్టం చేశారు. ఆర్థిక, పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పన, సమగ్రాభివృద్ధి కోసం తాము అధ్యయనం చేస్తామన్నారు. తాము కొన్ని అంశాలకే పరిమితం కాలేదని, అభివృద్ధి రాష్ట్రమంతటికీ విస్తరించేలా ప్రయత్నిస్తామని చెప్పారు.
ఆంధ్ర రాష్ట్ర చరిత్ర చూస్తే గతంలో సమగ్రాభివృద్ధి భావన ఉండేదని.. కర్నూలులో అసెంబ్లీ, గుంటూరులో హైకోర్టు, విశాఖలో విశ్వవిద్యాలయం ఉండేవన్నారు. ఇప్పుడు అదే చరిత్ర పునరావృతం అవుతుందన్నారు. రాజధాని నగరం రాష్ట్రానికి కేంద్రంగా ఉండాలని చంద్రబాబు సూచించారన్నారు. అయితే, ఒక సింగిల్ సూపర్ సిటీ నిర్మాణం సాధ్యం కాదన్నారు. చాలాచోట్ల రాజధాని నగరాలు ఇతర నగరాల అభివృద్ధికి కారణమయ్యాయని తెలిపారు.
గాంధీనగర్ వల్ల అహ్మదాబాద్, ఇస్లామాబాద్ వద్ద రావల్పిండి అభివృద్ధి చెందాయన్నారు. ప్రపంచంలో వివిధ దేశాల్లోని రాజధాని నగరాలను పరిశీలిస్తే.. పలు దేశాల్లో రాజధాని నగరాన్ని మించి నగరాలు అభివృద్ధి చెందాయని, అతి ముఖ్యమైన పాలనా వ్యవహారాలను మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఉండేలా చూడాల్సి ఉందని, మిగిలిన వాటిని ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. ఒడిసా రాజధాని భువనేశ్వర్ అత్యుత్తమ రాజధానిగా ఆయన అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం నిజాం సంస్థానం నుంచీ భూములు అందుబాటులో ఉండడమేన్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోటా భూములు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఈ పరిస్థితుల్లో భూ సేకరణ విపరీతమైన ఖర్చుతో కూడుకున్నదన్నారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న పట్టుదల చంద్రబాబులో కనిపించిందని శివరామకృష్ణన్ చెప్పారు. ఇలాంటి పట్టుదల కలిగిన ముఖ్యమంత్రి ఉండడం చాలా అవసరమన్నారు.
విశాఖ, దక్షిణ రాయలసీమ, అనంతపురం-కర్నూలు ప్రాంతాలు, మధ్య కోస్తా అభివృద్ధి చెందాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. విమానాశ్రయాలు, వైజాగ్- చెన్నై కారిడార్, శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే లైను, పోర్టులు వంటి వాటికి మౌలిక సదుపాయాల కల్పన సంక్లిష్టంగా మారిందని, వీటిపైనే ప్రధానంగా దృష్టి సారించి బాబుతో చర్చించామన్నారు. వీజీటీఎం అనువైన ప్రాంతం కాదన్నారు.
గుంటూరు-విజయవాడను రాష్ట్ర రాజధానిగా చేస్తామని ఒక మంత్రి భావించి ఉండవచ్చని, అది ఆయన అభీష్టం కావచ్చని, కానీ, ఆయన అభీష్టమే నెరవేరుతుందని ఆయన కూడా భావించడం లేదన్నారు. తాము విజయవాడ, గుంటూరుల గురించే మాట్లాడడం లేదని, మధ్య ఆంధ్ర గురించి మాట్లాడుతున్నామన్నారు. తిరుపతి, విశాఖలో రాజధాని నిర్మించాలన్నా అంత సులువు కాదన్నారు. అసెంబ్లీ భవనం శాసనసభ్యుల నివాస భవనాలు, సిబ్బంది క్వార్టర్లు నిర్మాణానికి 70 ఎకరాల వరకు కావాలన్నారు.
సీఎం ఆఫీస్, సెక్రటేరియెట్కు ఎక్కువ భూమి అవసరం లేదన్నారు. ఉద్యోగుల ఇళ్లు, ఇతర అవసరాలకు 120 ఎకరాలు కావాలన్నారు. శనివారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బృందం తమను కలిసిందన్నారు. కేంద్ర భూసేకరణ చట్టం కారణంగా రాజధాని కోసం భూమిని సేకరించడం సంక్లిష్టంగా మారుతుందన్నారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని అంటే చుట్టుపక్కల పంట భూముల సంగతేమింటన్నారు. అమరావతికీ ఇదే వర్తిస్తుందన్నారు. రాజధాని కోసం ఆహార భద్రతను విస్మరించలేమన్నారు.