విజయవాడ వాసులను భయపెడుతున్న పానీపూరీ బండి.. ఎందుకంటే.. ?
కొన్నిసార్లు ఎక్కడో జరిగిన ఓ ఘటనకు మరెక్కడో జరిగిన మరికొన్ని ఘటనలతో సంబంధం ఉందని చెప్పడం సినిమాల్లో చూడటమో, నవలల్లో చదవడమో చేసుంటాం. కానీ ఇప్పుడు ఢిల్లీలో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమానికి హాజరైన వారిలో సమాజంలో వివిధ రంగాలకు చెందిన వారు తమ చుట్టూ తిరిగిన వారిపై ఎలాంటి ప్రభావం చూపారో తెలిస్తే మతిపోక తప్పదు. ఇలాంటిదే ఓ ఘటన తాజాగా విజయవాడలో కలకలం రేపుతోంది. ఇది ఎటు తిరిగి ఎక్కడ తేలుతుందో తెలియక అధికారులు సైతం ఆందోళనలో ఉన్న పరిస్ధితి.
ఇదో బెజవాడ కథ...
అనగనగా ఒక ఊరు.. పేరు విజయవాడ. ఆ ఊరులో ఫేమస్ పానీపూరి వ్యాపారి.. ఆ వ్యాపారికి ఆ ఊరిలో 10 కి పైగా పానిపూరీ బళ్లు ఉన్నాయి. తన పానీపూరు బండ్లకి పానీపూరిలు స్వయంగా తన చేత్తోనే పానిపూరి పిండి కలిపి తయారు చేస్తారు. అన్ని కంటే పెద్ద పానీపూరి బండిని ఈయనే స్వయంగా నిర్వహిస్తారు.... ఇంతలో ఈయన అర్జెంట్ గా ఇతర దేశానికి వెళ్లాల్సిన పనిపడింది.... వచ్చేటప్పుడు డిల్లిలో ఒక సమావేశానికి వెళ్లారు. తిరిగి తన ఊరు వచ్చారు. ఓ 15 రోజులు బాగానే ఉన్నాడు... వ్యాపారాన్ని నడిపాడు... రోజూ ఆ పది బళ్ల దగ్గర కలిపి వందలమంది పానీపూరి తిన్నారు.. మద్యలో దగ్గు వస్తూ ఉండేది .. దేశం మారి వచ్చాం కదా వాతావరణం మార్పు వల్ల దగ్గు అనుకున్నాడు... వ్యాపారం మాత్రం ఆపలేదు. దగ్గు, గొంతునొప్పి విపరీతంగా పెరిగాయి.. దగ్గు మందు వేసుకొని అదే చేత్తో తన బండి దగ్గరకి వచ్చిన అందరికి పానిపూరి స్వయంగా తన చేత్తోనే కుండలో ముంచి, ఉల్లిపాయలు అద్ది ప్లేట్ లో పెట్టి ఇచ్చేవాడు..ఇంతలో తీవ్ర జ్వరం, దగ్గు, గొంతునొప్పి, కీళ్ల నొప్పులు... ఉండలేక ఆసుపత్రికి వెళితే #కరోనా_పాజిటీవ్ అని నిర్దారించారు. అతను ఇప్పుడు ఆసుపత్రిలో ఐసోలేషన్ లో ఉన్నాడు..
పానీపూరీ వాలాల పరిస్ధితి..
విజయవాడలో ఎంతో పాపులర్ అయిన ఈ పానీపూరీ వాలాకు పది బళ్లు ఉన్నాయి. కృష్ణలంకతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంటుంది. కానీ ఇప్పుడు కృష్ణలంకలో ఉన్న ఈ పానీపూరీ వాలాకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియడంతో అతని ఆధ్వర్యంలో పనిచేస్తున్న మరో 9 బళ్ల వారికీ చుక్కలు కనిపిస్తున్నాయి. కరోనా జనతా కర్ఫ్యూ విధించకముందు 15 రోజులుగా ఇతని వద్ద నుంచే మెటిరీయల్ తీసుకుని వీళ్లంతా అమ్ముకునే వారు. బాస్ కు కరోనా రావడంతో అతని వద్ద నుంచి రోజూ మెటీరియల్ తెచ్చుకునే తమకు అది సోకిందోమోనని ఇప్పుడు వీరంతా ఆందోళనలో ఉన్నారు.
కస్టమర్ల పరిస్దితి మరీ దారుణం..
నిత్యం ఈ పానీ పూరీ బళ్ల వద్ద జనం గుమికూడటం, వందల సంఖ్యలో పానీపూరీలు తినడం చకచకా జరిగిపోయాయి. అంతలో లాక్ డౌన్ రావడంతో వీరంతా ఇళ్లకు పరిమితం అవుతున్నారు. కానీ తాజాగా పానీపూరీవాలాకు కరోనా సోకిందన్న చేదు నిజం వీరిని నిద్ర లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో తెలియక వీరంతా ఆందోళన చెందుతున్నారు. తాము తిన్న పానీ పూరీలతో పాటు ఇతర మెటీరియల్ కూడా స్వయంగా ఈ కృష్ణలంకలోని పానీపూరీవాలా తయారు చేసినవే అని తెలియడంతో తమకు కూడా ఎక్కడ కరోనా వస్తుందో అన్న ఆందోళన వీరిలో నెలకొంది.
బాధితుల కోసం అధికారుల గాలింపు..
విజయవాడలోని పానీపూరీ వాలా దగ్గర 15 రోజుల క్రితం పానీపూరీ తిన్న వారిలో ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు ఉంటే వెంటనే తమను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. అలాగే సదరు పానీపూరీ వాలా నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అతను సప్లై చేసే బళ్లను నడుపుతున్న వారి గురించి కూడా ఆరా తీస్తున్నారు. మరోవైపు ఢిల్లీ వెళ్లొచ్చిన పానీపూరీవాలా నివసించిన కృష్ణలంక ప్రాంతాన్ని పూర్తిగా బంద్ చేసేశారు. ఇక్కడ ప్రస్తుతం నిత్యావసర సరుకుల కొనుగోళ్లు, అమ్మకాలకు సైతం అనుమతి లేదు.