ఆఫ్లైన్ తరగతులకు హాజరుకావాలని తల్లిదండ్రుల ఒత్తిడి.. కాలేజీలో ఆత్మహత్యకు పాల్పడిన ట్రిపుల్ ఐటీ విద్యార్థిని
రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఐఐఐటీ-శ్రీకాకుళంలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్లోని విజయనగరానికి చెందిన విద్యార్థిని ఫిబ్రవరి 16, బుధవారం నాడు తన హాస్టల్ గదిలోనే ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాలలోని కొందరు విద్యార్థినులు ఇది గమనించి కళాశాల అధికారులకు ఫిర్యాదు చేయడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు.
కళాశాల హాస్టల్ లో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని
వివరాల్లోకి వెళితే విజయనగరం నెల్లిమర్లకు చెందిన కొండపల్లి మనీషా అంజు అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకుని విగతజీవిగా మారింది. కొండపల్లి మనీషా అంజు ఐఐటీ-శ్రీకాకుళం మొదటి సంవత్సరం చదువుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి ఆమె ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నారు.తాజా కోవిడ్-19 కేసులు తగ్గడం ప్రారంభించిన తర్వాత, కళాశాల అధికారులు విద్యార్థులకు ఆఫ్లైన్ తరగతులకు రావాలని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆన్లైన్ తరగతులు కూడా అటెండ్ కావచ్చని పేర్కొన్నారు.
ఆఫ్ లైన్ తరగతులకు హాజరుకానని తల్లిదండ్రులతో గొడవ
అయితే విద్యార్థిని ఆన్లైన్ తరగతులను కొనసాగించాలని కోరుకున్నప్పటికీ, ఆమె తల్లిదండ్రులు ఆమెను ఆఫ్లైన్ తరగతులకు హాజరుకావాలని పట్టుబట్టి ఆమెను ఐఐఐటీ-శ్రీకాకుళంకు తీసుకువచ్చారని సమాచారం. తల్లిదండ్రులపై కోపంతో ఆ యువతి తన మొబైల్ను బస్సులో విసిరేసిందని తెలిసింది. ఆమె తల్లిదండ్రులు మరుసటి రోజు ఆమెకు కొత్త ఫోన్ కొనిచ్చారు. తనకు ఆరోగ్యం బాగోలేదు అంటే, అంజు తండ్రి వచ్చి ఆమెతో మాట్లాడి వెళ్లారు. మరుసటి రోజే అంజు ఈ అఘాయిత్యానికి పాల్పడింది.
ఇష్టానికి విరుద్ధంగా ఆఫ్లైన్ తరగతులకు హాజరు కావటంతో ఆత్మహత్య
బుధవారం ఆమె గది లోపలి నుంచి తాళం వేసి ఉండటాన్ని గమనించిన కొందరు బాలికలు కళాశాల అధికారులకు సమాచారం అందించారు. అధికారులు తలుపులు పగలగొట్టి చూడగా ఆమె ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఆఫ్లైన్ తరగతులకు హాజరు కావాల్సిందిగా ఆమె తల్లిదండ్రులు ఆమెను బలవంతం చేశారని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
Recommended Video
కుమార్తె మృతితో విలపిస్తున్న తల్లిదండ్రులు
మరోవైపు ఎన్నో ఆశలతో అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను ట్రిపుల్ ఐటీ లో జాయిన్ చేశామని మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశించామని కానీ హఠాత్తుగా ఈ విధమైన నిర్ణయం తీసుకుందని అందుకు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎప్పుడూ హుషారుగా ఉండే అంజు మృతిపట్ల తోటి విద్యార్థులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదువుల ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడిందా లేక ఇంటికి దూరంగా ఉండలేక కఠిన నిర్ణయం తీసుకుందా లేక అంజు ఆత్మహత్య వెనుక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.