పరిటాలను వైఎస్ చంపించారు: బాబు, శ్రీకాంత్ రెడ్డి ఫైర్

అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పరిటాలకు ఉన్న భద్రతను తొలగించి నిరాయుధుడ్ని చేసి హత్య చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు దోషులపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఆశయం కోసం ప్రాణాలు వదిలిన వ్యక్తి పరిటాల రవి అని చంద్రబాబు కొనియాడారు.
పరిటాల రవి హత్య కేసులో సాక్షులను కూడా జైల్లో, బయటా దశలవారీగా హత్యలు చేసి అసలు దోషులపై చర్యలు లేకుడా చేశారని ఆయన మండిపడ్డారు. ఒక ఆశయం కోసం పరిటాల రవి ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. పరిటాల రవి కుటుంబం కూడా బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం ఎంతో పోరాడుతోందని అన్నారు. హత్యా రాజకీయాలు పోతేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అన్నారు.
పరిటాల రవికి నివాళులు అర్పించిన కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కోడెల శివప్రసాద్, తొండెపు దశరథ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
కాగా, చంద్రబాబు ఆరోపణలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు గండికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు ఏనాడూ చిత్తశుద్ధితో వ్యవహరించలేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అవకాశం దొరికితే చాలు తమ పార్టీపై బురద చల్లడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.
పరిటాల రవి హత్యపై చంద్రబాబు చంద్రబాబు చేస్తున్నవి సిగ్గులేని ఆరోపణలని ఆయన అన్నారు. చాలా మంది నేతలు పరిటాల రవికి దగ్గరవుతున్నారనే బాధతో చంద్రబాబే హత్య చేయించారని ఆయన ప్రత్యారోపణ చేశారు. పార్టీలో తనకు ఎదురు లేకుండా చేసుకోవడానికి పరిటాలను చంద్రబాబే చంపించారని ఆయన అన్నారు.
చంద్రబాబు అన్నీ ఇలాంటి రాజకీయాలే చేస్తున్నారని ఆయన అన్నారు. ఎన్టీ రామారావును పదవి నుంచి దించడానికి కూడా అలాంటి రాజకీయాలే చేశారని ఆయన అన్నారు. మాజీ మంత్రులు ఎలిమినేటి మాధవరెడ్డి, పి ఇంద్రారెడ్డి మరణాలపై సిబిఐ దర్యాప్తునకు చంద్రబాబు సిద్ధపడాలని ఆయన సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications