పరిటాల శ్రీరామ్ అరెస్ట్, అదుపులో వసంత తనయుడు
అనంతపురం: అనంతపురం జిల్లా రాప్తాడు శాసన సభ్యురాలు, టిడిపి నేత పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ను శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలకుంట్ల రాళ్లదాడి కేసులో శ్రీరామ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత రెండు రోజుల క్రితం కనగాలపల్లి మండలం ఎలకుంట్లలో జరిగిన ప్రచార కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెసు, టిడిపి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఈ ఘర్షణలో ఇరు వర్గాల మధ్య పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ ఉదయం కనగాలపల్లి పోలీస్స్టేషన్లో శ్రీరామ్ లొంగిపోయారు. శ్రీరామ్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను ధర్మవరం కోర్టుకు తరలించారు. కోర్టు ఆయనకు 16వ తేదీ వరకు రిమాండ్ విధించింది.

పోలీసుల అదుపులో వసంత తనయుడు
టిడిపి నేత, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు కృష్ణప్రసాద్ను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. గతంలో జరిగిన పొదిలి రవి హత్యకేసులో కృష్ణప్రసాద్పై ఆరోపణలు ఉండటంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి నందిగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కోర్టులో హాజరు పర్చారు. ఆయనకు కోర్టు 16వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
నందిగామలో కృష్ణప్రసాద్ టిడిపికి కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే కృష్ణప్రసాద్ను సంబంధంలేని కేసులో అదుపులోకి తీసుకున్నారని టిడిపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నందిగామ ఏరియా ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో చేరుకున్న కార్యకర్తలు కృష్ణప్రసాద్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాజకీయ కుట్రలో భాగంగానే తనను అరెస్ట్ చేశారని కృష్ణప్రసాద్ అన్నారు. తన కుమారుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారని వసంత నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక తన కొడుకు పైన కేసు నమోదు చేయించారని ఆయన అన్నారు. కాగా, వసంత నాగేశ్వర రావు టిడిపిలో చేరారు.












Click it and Unblock the Notifications