జబర్దస్త్ కామెడీ షోలా వైసీపీ పాలన, జగన్ హయాంలో ప్రజలు సోమరిపోతులుగా: పరిటాల శ్రీరామ్ ధ్వజం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై, వైసీపీ ప్రభుత్వ పాలన పై టిడిపి అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు . తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనంతపురం రాప్తాడు లో పరిటాల శ్రీరామ్ టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ టీడీపీ గొప్పతనాన్ని , గత టీడీపీ పాలనను కొనియాడారు . వైసీపీ పై మండిపడ్డారు.
జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రశాంతత లేదు , అభివృద్ధి లేదు
వైసిపి ప్రభుత్వ పాలన జబర్దస్త్ కామెడీ షో లా ఉందని పరిటాల శ్రీరామ్ అసహనం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో వైసీపీ నేతలు అశాంతిని రేపుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టిడిపి అధికారంలో ఉన్న ఐదేళ్లు అభివృద్ధి జరిగిందని, రాష్ట్రం ప్రశాంతంగా ఉందని పేర్కొన్న పరిటాల శ్రీరామ్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అభివృద్ధి ఏమాత్రం జరగలేదని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలను సోమరిపోతులను చేస్తున్న సర్కార్
ప్రతిపక్ష నేతల పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం తప్ప వైసీపీ చేసిందేమీ లేదని ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు సాంఘిక సంక్షేమ పథకాల పేరిట డబ్బు పంపిణీ చేసి ప్రజలను సోమరిపోతులుగా తయారు చేస్తున్నారని వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని విమర్శించారు. వాలంటీర్లను ఏర్పాటు చేసి పెత్తందారీ విధానాలను అమలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు . రాష్ట్రం ఏ మాత్రం పాలన లేకుండా, స్టార్టప్ కంపెనీ లా ఉందని పరిటాల శ్రీరామ్ విమర్శించారు.
వాలంటీర్ వ్యవస్థ దుర్వినియోగం .. వారిద్వారా ఎన్నికల బెదిరింపులు
ముష్టి కోవెలలో కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్తే అక్రమ కేసులు పెట్టారని పరిటాల శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ను కొందరు వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, కొందరు వైసీపీ నేతలు కలెక్టర్ పేరు చెప్పుకొని దందాలు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో వాలంటీర్లను ఉపయోగించుకొని ప్రజలను బెదిరించి మునిసిపాలిటీలను , కార్పొరేషన్లను, పంచాయతీలను వైసిపి గెలిచిందని పరిటాల శ్రీరామ్ ఆరోపించారు.
వైసీపీపై ప్రజలు తిరగబడే రోజులు వస్తాయి
కర్ణాటక మద్యం రాకెట్ ను పోలీసులు పట్టించుకోవడం లేదని పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. వైసీపీపై ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని శ్రీరామ్ పేర్కొన్నారు . వైసీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని శ్రీరామ్ ఆరోపించారు . మళ్ళీ టీడీపీ అధికారంలోకి తప్పక వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు .