"మైక్ పట్టుకోవడం కూడా రాని నేనిలా!.. బాబు వల్లే.., నా బొట్టు తుడిచినవాళ్లను నమ్మొద్దు"
తన బొట్టును తుడిచినవారి మాటలను ప్రజలు నమ్మవద్దని సునీత కోరారు.
అనంతపురం: 2019లో అధికార పీఠమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్ పై మంత్రి పరిటాల సునీత తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. జగన్, ఎమ్మెల్యే రోజా ఇద్దరూ పగటి కలలు కంటున్నారని, వారి ఆశలు అడియాశలే అవుతాయని ఆమె వ్యాఖ్యానించారు.
Recommended Video


జగన్ రాడు.. రోజా రాదు:
ఎవరో వస్తారు.. ఏదో చేస్తారన్న ఆలోచనలు అనవసరమని పరిటాల సునీత అన్నారు. వైఎస్ హయాంలో డ్వాక్రా సంఘాలు నిర్వీర్యం అయిపోయాయని గుర్తుచేశారు. అలాంటిది ఇప్పుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ జగన్ మాట్లాడుతుండటం హాస్యాస్పదమని సునీత అన్నారు.

రోజాకు ఏం తెలుసు?:
రోజాకు ఏం తెలుసని ప్రశ్నించిన సునీత.. మహిళలు ఆమెను నమ్మి వెంట నడవాలని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం డ్వాక్రా మహిళలు నెలకు రూ.10వేలు సంపాదించుకునేలా వారికి రుణాలు ఇస్తున్నామన్నారు. పసుపు, కుంకుమ పథకం కింద రూ.10వేల అందిస్తున్నామని గుర్తుచేశారు.

చంద్రన్నకు అక్కా చెల్లెళ్లుగా:
రాష్ట్రంలో 90లక్షల మంది డ్వాక్రా మహిళలు చంద్రన్నకు అక్కా చెల్లెళ్లుగా ఉన్నారని సునీత పేర్కొన్నారు. చంద్రన్న పెళ్లి కానుక, చనిపోయిన సమయంలో రూ.5వేలు ఇవ్వడం లాంటి పథకాలును ప్రజలకు డ్వాక్రా సంఘాల మహిళలు వివరించాలని కోరారు.

నా బొట్టు తుడిచినవారిని:
పాదయాత్రలో జగన్ అన్నీ 'ఫ్రీ' అంటున్నారని.. 45ఏళ్లకే ఫించన్ ఇస్తామంటున్నారని సునీత ఎద్దేవా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం రూ.1000 పెన్షన్ ఇస్తుంటే.. వేలం పాట మాదిరి జగన్ రూ.2వేలు ఇస్తామంటున్నారని విమర్శించారు.
తన బొట్టును తుడిచినవారి మాటలను ప్రజలు నమ్మవద్దని సునీత కోరారు. తన భర్తను హత్య చేసిన తర్వాత తాను భయపడిపోయి బయటకు కూడా రాలేక పోయానని అన్నారు. చంద్రబాబే భయపడవద్దని ధైర్యం చెప్పి తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని చెప్పారు. మైక్ పట్టుకోవడం కూడా చేతకాని తనను ఇంత స్థాయికి తీసుకొచ్చారని అన్నారు.












Click it and Unblock the Notifications