'సాక్షి' కథనంపై పరిటాల స్పందన: దాడి నిజమే, చెప్పుతో కొట్టలేదు!..
ఎంపీడీవో కార్యాలయం టైపిస్టుపై దాడి జరిగిన మాట వాస్తవమేనని, అయితే ఎంపీపీ భర్త ముకుందనాయుడు చెప్పుతో కొట్టారని వచ్చిన వార్తలో వాస్తవం లేదని అన్నారు.
అనంతపురం: సాక్షి పత్రిక పేరెత్తితే చాలు టీడీపీ నేతలు చిర్రెత్తిపోతారు. అసలు ఆ పత్రికను చదవొద్దు అంటూ వేదికల మీద నుంచే ప్రకటనలు కూడా చేస్తారు. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు సైతం 'సాక్షి' పత్రిక చదవుతూ మీడియా కంట పడటం అడ్డంగా దొరికిపోయినట్లయింది. రిఫరెన్స్ కోసమైనా సాక్షి పత్రికను టీడీపీ నాయకులు కచ్చితంగా ఫాలో అవాల్సిన పరిస్థితి వచ్చిందని దీనితో తేట తెల్లమైంది.
టీడీపీ అనుకూల మీడియా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఒకవిధంగా సాక్షి ద్వారా మాత్రమే ఆ పార్టీ తప్పిదాలు, వ్యతిరేకతలు బయటపడుతున్నాయి. దీంతో ఆ పత్రిక కథనాలపై టీడీపీ నాయకులు కచ్చితంగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తాజాగా తన నియోజకవర్గంలో జరిగిన ఓ ఘటనపై సాక్షి కథనాన్ని ప్రచురించడంతో మంత్రి పరిటాల సునీత నోరు మెదపక తప్పలేదు.
పరిటాల ఇలాకాలో అరాచకం అంటూ ప్రచురితమైన కథనాన్ని పరిటాల సునీత ఖండించారు. కనగానపల్లి ఎంపీడీవో కార్యాలయం టైపిస్టుపై దాడి జరిగిన మాట వాస్తవమేనని, అయితే ఎంపీపీ భర్త ముకుందనాయుడు చెప్పుతో కొట్టారని వచ్చిన వార్తలో వాస్తవం లేదని అన్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని హామి ఇచ్చారు.
ఫించన్ల జాబితాను తయారుచేసే విషయంలో టైపిస్టుకు, ముకుందనాయుడికి మధ్య వాగ్వాదం జరిగిందని, టీవీల్లో వచ్చినట్లు దాడి మాత్రం జరగలేదని తెలిపింది. పరిటాల సునీత జోక్యంతో ఎంపీపీ పద్మగీత, ఎంపీడీఓ జలజాక్షి తదితరులు మీడియా సమావేశం నిర్వహించి, ఇకపై ప్రజా ప్రతినిధులు, అధికారులమంతా ఐక్యంగా పనిచేస్తామని చెప్పారు. టైపిస్టు మూర్తికి అధికారులకు మధ్య రాజీ కుదిరినట్లు సమాచారం.