చంద్రబాబు గంట కళ్ళు మూసుకుంటే కథ వేరేలా ఉంటదన్న పరిటాల సునీత; తరిమికొడతామన్న దేవినేని ఉమా !!
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత రాష్ట్రంలో తాజా పరిణామాల నేపధ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులను తీవ్రంగా ఖండించిన పరిటాల సునీత, వైసీపీ నాయకుల తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. తమది సీమ రక్తమే అని, తమకు బీపీ వస్తుందని పరిటాల సునీత వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో చంద్రబాబుపై పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ ఆఫీసుపై దాడికి నిరసనగా చంద్రబాబు దీక్ష (ఫోటోలు)
చంద్రబాబు ఇకనైనా మారాలన్న పరిటాల సునీత
చంద్రబాబు ఓకే అంటే ఏం చేయడానికైనా సిద్ధమేనంటూ పరిటాల సునీత వ్యాఖ్యానించారు. అంతేకాదు చంద్రబాబు ఇకనైనా మారాలని పరిటాల సునీత సూచించారు. చంద్రబాబు గంట కళ్లు మూసుకుంటే కథ వేరేలా ఉంటుందని వైసీపీ నేతలకు పరిటాల సునీత వార్నింగ్ ఇచ్చారు. తన భర్త హత్య సమయంలో కూడా చంద్రబాబు ఓర్పుగా ఉండమన్నారని, నాదే చంద్రబాబు కన్నెర్ర చేసి ఉంటే ఒక్కరు కూడా మిగిలేవారు కాదని వ్యాఖ్యానించారు. మా నాయకుడి సంయమనం చూసి రెచ్చిపోతే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక వైసీపీకి చుక్కలు చూపించటం ఖాయమని ఆమె తేల్చి చెప్పారు. ప్రభుత్వ ఉగ్రవాదంపై ప్రజలు, ప్రజాస్వామ్య పరిరక్షకులు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె పేర్కొన్నారు.
దుర్మార్గపు వైసీపీ పాలన అంతానికి చంద్రబాబు చేస్తున్న దీక్షతో బీజం పడాలన్న సునీత
దుర్మార్గపు వైసీపీ పాలన అంతానికి చంద్రబాబు చేస్తున్న నిరసన దీక్షతో బీజం పడాలని పరిటాల సునీత ఆకాంక్షించారు. ఒకసారి మా కార్యకర్తలకు కనుసైగ చేస్తే చాలు మీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని కంటికి కనిపించకుండా చేస్తారని పరిటాల సునీత మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచకత్వం రాజ్యమేలుతుందని, రాక్షసత్వం పెరిగిపోతుందని పరిటాల సునీత అభిప్రాయపడ్డారు. వైసీపీ శ్రేణుల తీరు మారకుంటే కచ్చితంగా తగిన గుణపాఠం చెబుతామని పరిటాల సునీత హెచ్చరించారు.
మంత్రులు బరితెగించి బూతులు తిడుతున్నారు: దేవినేని ఉమా
ఇదిలా ఉంటే మాజీ మంత్రి దేవినేని ఉమ సైతం వైసీపీ సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై గంజాయి బ్యాచ్ తో దాడి చేశారని ఈ దాడులకు భయపడేది లేదని దేవినేని ఉమా తేల్చిచెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో అరాచకత్వం కొనసాగుతుందని, టిడిపి నేత పట్టాభి ఇంటి పై దాడి చేశారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్న దేవినేని ఉమా జగన్ రెడ్డి గుర్తుంచుకో మంత్రులు బరితెగించి బూతులు తిడుతున్నారు అందరిని ప్రజాస్వామ్య పద్ధతిలో తరిమికొడదాం అంటూ హెచ్చరించారు. నేరగాళ్ల పాలనలో రాష్ట్రంలో పరిస్థితి ఇలానే ఉంటుందని దేవినేని ఉమ అభిప్రాయపడ్డారు.
18 కేసుల్లో ముద్దాయి జగన్ రెడ్డి పాలనలో ఇంతకన్నా ఏం ఆశించలేమన్న మాజీ మంత్రి
11 సిబిఐ కేసులు, 6 ఈడీ కేసులతో కలిపి మొత్తం 18 కేసులలో ముద్దాయిగా ఉన్నది జగన్ రెడ్డి కాదా అంటూ ప్రశ్నించారు. జగన్ రెడ్డి పరిపాలనలో ఇంతకన్నా ఏమి ఆశించలేం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. వేల ఎకరాల్లో సాగవుతున్న గంజాయి గురించి మాట్లాడితే వాటిని పక్కదారి పట్టించడానికి దాడులు చేస్తున్నారని దేవినేని ఉమా అభిప్రాయపడ్డారు. జగన్ రెడ్డికి డిజిపి సాగిల పడ్డాడని, ఐదు సార్లు కోర్టు మెట్లు ఎక్కారు అని దేవినేని ఉమ విమర్శించారు. తప్పు చేసిన అధికారుల చిట్టా అంతా సిద్ధంగా ఉందని దేవినేని ఉమా పేర్కొన్నారు .
ఏపీలో జగన్ పాలనలో అవినీతి, దాడులపై సీబీఐ దర్యాప్తు చెయ్యాలి
జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చక చాలా జిల్లాల నుండి వైసీపీ నుంచి బయటకు రావడానికి నేతలు సిద్ధంగా ఉన్నారని దేవినేని ఉమ పేర్కొన్నారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల నేతలు చేరికలకు సిద్ధంగా ఉన్నారు. జగన్ రెడ్డి మోసాలను వారంతా గుర్తించారని మండిపడ్డారు. ఇటీవల ఒక మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని, అసమర్థ, అవినీతి జగన్ పాలన పై, కొనసాగుతున్న దాడులపై సిబిఐ దర్యాప్తు చేయాలని దేవినేని ఉమ అభిప్రాయపడ్డారు.