‘బస్సెక్కి రైట్’: రైతుల కోసం టీచర్ అవతారమెత్తిన పరిటాల సునీత
అనంతపురం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఆదివారం జిల్లాలో పర్యటించారు. అంతేగాక, తన కారును వదిలేసి బస్సెక్కారు. రైతులతో నిండివున్న ఆ బస్సులో తన సీటులో కూర్చుని డ్రైవర్కు రైట్ చెప్పారు మంత్రి. ఆ తర్వాత మంత్రి పరిటాల సునతీ టీచర్ అవతారం ఎత్తారు.
వివరాల్లోకెళితే.. అనంతపురం జిల్లాలో సాగు, తాగు నీటి కోసం ప్రభుత్వం చేపట్టిన హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం దాదాపుగా పూర్తి కావస్తోంది. అసలు ఈ ప్రాజెక్టుకు ఎక్కడి నుంచి నీరు వస్తుంది, ఎక్కడ నిల్వ చేసుకోవాలి, ఏఏ ప్రాంతాలకు ఈ పథకం నుంచి నీరు సరఫరా అవుతుందన్న విషయాలపై జిల్లా రైతాంగానికి అంతగా అవగాహన లేదు.

ఇదే విషయాన్ని గమనించిన మంత్రి పరిటాల.. వినూత్న పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఎంపిక చేసిన రైతులను అనంతపురం రప్పించిన మంత్రి.. అక్కడ అప్పటికే సిద్ధంగా ఉంచిన బస్సెక్కించారు. తాను కూడా వారితో పాటు బస్సెక్కారు.
బస్సును హంద్రీ-నీవా ప్రాజెక్టు వెంట తీసుకెళ్లమని డ్రైవర్కు చెప్పిన సునీత.. ఆయా ప్రాంతాల్లో బస్సును ఆపి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను రైతులకు వివరిస్తూ ముందుకు సాగారు. ఈ యాత్ర ఆదివారం సాయంత్రం దాకా కొనసాగింది.












Click it and Unblock the Notifications