ప్రతీది రచ్చ, ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు: పరిటాల, పరకాల, ఉమ్మారెడ్డి దిమ్మతిరిగే కౌంటర్
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశాన్ని రచ్చ చేస్తోందని మంత్రి పరిటాల సునీత మంగళవారం మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా వైసీపీ రచ్చ చేయడం విడ్డూరమని విమర్శించారు. పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.
జన్మభూమి - మా ఊరు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆమె అన్నారు. దీనిని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదవారికి ఉపయోగపడే ఈ కార్యక్రమంపై అసత్య ప్రచారం చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు
మరోవైపు, జన్మభూమి - మా ఊరు కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తే ప్రభుత్వం సహించదని రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పారు. సభకు రానీయకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. ప్రజల్లో సంతృప్తస్థాయిని పెంచడమే లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు.

వీటిపై అధ్యయనం చేయాల్సి ఉంది
జన్మభూమి సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ వివరాలను మంగళవారం పరకాల వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో అర్జీలు తక్కువగా, మరికొన్ని చోట్ల ఎక్కువగా ఉన్నాయని, వీటిపై అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల అమలు, అర్జీల పరిష్కారంలో సగం మంది అసంతృప్తితో ఉన్నారు. రేషన్ కార్డుల మంజూరు, పింఛన్ల పంపిణీలోనూ మూడింట ఒకవంతు మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎనిమిది లక్షలకు పైగా వినతులు
అర్హులకు పింఛన్లు అందడం, రేషన్ కార్డులు అందడంపై దాదాపు డెబ్బై శాతం మంది సంతృప్తిగా ఉన్నారని, ముప్పై శాతానికి పైగా అసంతృప్తితో ఉన్నారుని తేలింది. వారం రోజుల జన్మభూమిలో ఎనిమిది లక్షలకు పైగా వినతులు వచ్చాయి.
Recommended Video


ఉమ్మారెడ్డి దిమ్మతిరిగే కౌంటర్
ఇదిలా ఉండగా, అయిదో విడత జన్మభూమి కార్యక్రమంలో ఇప్పటి వరకు ప్రజల నుంచి ఏడున్నర లక్షలకు పైగా అర్జీలు వచ్చాయని చెబుతున్నారని, అంటే నాలుగేళ్లుగా టీడీపీ ప్రభుత్వం విఫలమైందని అంగీకరించడమే కదా అని వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గట్టి కౌంటర్ ఇచ్చారు. జన్మభూమి - మా ఊరు ఖర్చు ప్రభుత్వానిది అయితే, ప్రచారం పార్టీకి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications