చంద్రబాబుపై ఇద్దరు వైసీపీ నేతల ప్రశంస, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వలేవా: జగన్కు పరిటాల సునీత
శ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు పరిటాల సునీత శనివారం, ఆదివారం ధ్వజమెత్తారు. టిట్లీ తుఫాను బాధితులను పరామర్శించేందుకు కూడా ఆయనకు తీరిక లేదని ఎద్దేవా చేశారు.
తుపాను వచ్చిన తెల్లవారి నుంచే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలాస చేరుకొని సహాయక పనులు పర్యవేక్షించారని సునీత చెప్పారు. కానీ జగన్ పక్క జిల్లాలోనే ఉండి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తూ ఇక్కడ కనీసం బాధితులను పరామర్శించేందుకు రాలేదన్నారు. అంత తీరిక కూడా లేదా అన్నారు.

ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడా లేరు
దేశంలో ఏ రాష్ట్రంలో అయినా విపత్తులు సంభవిస్తే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏరియల్ సర్వే చేస్తారే తప్ప ఆ ప్రాంతంలోనే ఉండే పరిస్థితి ఎక్కడా ఉండదని పరిటాల సునీత అన్నారు. కానీ ఏపీలో చంద్రబాబు తుపాను ప్రభావిత ప్రాంతాల్లోనే ఉండి ప్రజలకు కావలసిన సహాయక పనులు చేపడుతున్నారన్నారు.

దేవుడు ఇచ్చిన వరం
నిరంతరం ప్రజల కోసం ఆలోచించే చంద్రన్న అండగా ఉంటే టిట్లీ లాంటి ఏ విపత్తునైనా అవలీలగా ఎదుర్కోవచ్చని సునీత అన్నారు. రాజకీయాలకతీతంగా ప్రతీ కుటుంబాన్ని ఆదుకొనే చర్యలకు అందరి సహకారం అవసరమన్నారు. ఇలాంటి విపత్తులెన్నింటినో ఎదుర్కొని తక్కువకాలంలో పరిస్థితులను చక్కదిద్దిన ఘనత దేశంలో ఒక్క చంద్రబాబుకే దక్కుతుందన్నారు. 22వ తేదీ సాయంత్రానికల్లా అన్ని గ్రామాలకు విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామన్నారు. కష్టకాలంలోనే ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, తాను కష్టపడుతూ ప్రజల ఇబ్బందులను పరిష్కరించే గొప్ప ముఖ్యమంత్రి మనకు దేవుడిచ్చిన వరమన్నారు. అలాంటి ముఖ్యమంత్రికి అందరూ అండగా ఉండాలన్నారు.

చంద్రబాబుపై ఇద్దరు వైసీపీ నేతల ప్రశంసలు
టిట్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తాను శనివారం 12 గ్రామాల్లో తిరిగానని పరిటాల సునీత అన్నారు. ప్రజలు తనను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారని చెప్పారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు చేస్తున్న సహాయక చర్యలను మెచ్చుకున్నారని తెలిపారు. వైసీపీకి చెందిన ఇద్దరు నేతలు తన వద్దకు వచ్చి చంద్రబాబును పొగుడుతూ మాట్లాడారని చెప్పారు. సహాయక చర్యలపై అందరూ సంతృప్తిగా ఉన్నారన్నారు.

మజ్జిగ ప్యాకెట్ ఇచ్చే స్థోమత లేదా
జగన్ లాంటి ప్రతిపక్ష నేత ఉండటం మన దురదృష్టమని పరిటాల సునీత అన్నారు. ఆయన ఇంత వరకు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేదని మండిపడ్డారు. లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తికి తుఫాను బాధితులకు కనీసం మజ్జిగ ప్యాకేట్ ఇచ్చే స్తోమత కూడా లేదా అని నిలదీశారు.












Click it and Unblock the Notifications