జెసి చేరికపై పరిటాల సునిత అసంతృప్తి, శ్రీరాంకు బాధ్యత
రాప్తాడు, పెనుంగొడ తమకు రెండు కళ్లలాంటివని, రెండు నియోజక వర్గాల్లోనూ తమ పాత్ర ఉంటుందని పరిటాల సునిత చెప్పారు. తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రాణాలైనా అర్పిస్తామని అన్నారు. కాగా, అనంతపురం జిల్లా ఘర్షణల నేపథ్యంలో జెసి కుటుంబానికి, పరిటాల కుటుంబానికి ఎప్పటి నుంచో వైరం ఉంది.
కాగా, పెనుగొండ, రాప్తాడులలో తమకు పట్టుందని సునిత చెప్పారు. తాను రానున్న ఎన్నికల్లో పెనుగొండ నుండి పోటీకి సిద్ధమని, అయితే చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అన్నారు. తాను ఎక్కడి నుండి పోటీ చేయాలనేది బాబు నిర్ణయిస్తాన్నారు. తన తనయుడు పరిటాల శ్రీరామ్కు ప్రచార బాధ్యతలు అప్పగిస్తానని చెప్పారు. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ జీరో అని, కొందరు టిడిపితో కలిసి పని చేసేందుకు, మరికొందరు స్వార్థంతో వస్తున్నారన్నారు. స్వార్థంతో వచ్చే వారి పేరు పలికేందుకు కూడా తాను ఇష్టపడనన్నారు.
టిడిపిలో చేరిన తోట
ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టిడిపిలో చేరారు. బుధవారం ఉదయం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో తోట త్రిమూర్తులు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తోట మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుతోనే సీమాంధ్ర అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబును చూస్తే హైటెక్ సిటీ జగన్ను చూస్తే చంచల్గూడ జైలు గుర్తుకు వస్తుందని ఆయన అన్నారు. ఆంధ్రాలో హైదరాబాద్లాంటి నగరాలను నిర్మించే సత్తా చంద్రబాబుకే ఉందని తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు.
కోదండరామ్ నో
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ జెఏసి నేతలు పోటీ చేయాలని కోరిన తెరాస ప్రతిపాదనను ఐకాస ఛైర్మన్ కోదండరామ్, టిఎన్జీవో అధ్యక్షులు దేవీప్రసాద్ తిరస్కరించారు. ఉద్యోగ సంఘాలకు చెందిన శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే సుముఖత వ్యక్తం చేశారు.