తెలంగాణ: సీమాంధ్ర టిడిపి, జగన్ పార్టీ ఒక్కటయ్యారా?
హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రవేశ పెట్టిన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత శాసన సభ్యులు పార్టీలకతీతంగా ఒక్కటయ్యారా? అంటే అవుననే అంటున్నారు. బిల్లు పైన ఇప్పటికే ప్రాంతాలవారీగా ప్రజాప్రతినిధులు చీలిపోయారు. ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా కలిసిపోయి బిల్లును ఎలా అడ్డుకోవాలనే విషయమై కూడా చర్చిస్తున్నారట.
శాసన సభలో, శాసన మండలిలో సోమవారం ముసాయిదా బిల్లు ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇది అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. అసెంబ్లీలో బిల్లు పైన చర్చ ప్రారంభమైందనే విషయమై కూడా రభస కొనసాగుతోంది. చర్చ ప్రారంభమైందని టి నేతలు చెబుతుంటే, ప్రారంభం కాలేదని సీమాంధ్ర నేతలు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో బిల్లును ఏలా అడ్డుకోవాలనే అంశంపై సీమాంధ్ర తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లుగా సమాచారం. అసెంబ్లీ మంగళవారానికి వాయిదా పడిన నేపథ్యంలో రేపు ఏం చేయాలనే అంశంపై కూడా సీమాంధ్ర నేతలు పార్టీలకతీతంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.
సభ జరిగిన తీరు బాధాకరం: పయ్యావుల
సభ జరిగిన తీరు బాధాకరమని సీమాంధ్ర టిడిపి నేత పయ్యావుల కేశవ్ టిడిఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అన్నారు. సభలో బిల్లు పైన చర్చ ప్రారంభం కాలేదన్నారు. అత్యంత అప్రజాస్వామికంగా సభ జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదో రహస్య అజెండాలా సాగిందన్నారు. బిల్లు ప్రవేశ పెట్టే సమాచారం తెలంగాణ నేతలకు మాత్రమే ఉందని, సీమాంధ్ర నేతలకు లేదన్నారు. పది గంటలకే తెలంగాణ నేతలు సదారంకు రక్షణగా నిలబడ్డారన్నారు. బిల్లును సభలో ప్రవేశ పెట్టారని, చర్చ మాత్రం ప్రారంభం కాలేదన్నారు. సభను వాయిదా వేసి ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
రాత్రి కిరణ్తో సీమాంధ్ర నేతలు భేటీ
రాత్రి ఏడు గంటలకు సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ కానున్నారు. బిల్లు సభలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ఏం చేయాలనే అంశంపై చర్చించనున్నారు.