జివోఎంకు ఒకరు నో, ఇంకొకరు టైం అడిగారు(పిక్చర్స్)
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై మంత్రుల బృందం(జివోఎం)కు ఆయా పార్టీలు ఇవ్వవల్సిన నివేదికకు సమయం మంగళవారంతో ముగిసింది. జివోఎం లేఖకు కొన్ని పార్టీలు స్పందించక పోగా, ఇంకొన్ని డిమాండ్లతో కూడిన నివేదికలు సమర్పించాయి. భారతీయ జనతా పార్టీ మరో రెండు రోజుల సమయం కోరింది.
తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతానికి నాయకుల అభిప్రాయాలతో రెండు నివేదికలను ఒకటిగా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పంపించారు. తెలుగుదేశం పార్టీ జివోఎంను బహిష్కరించింది. ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విభజన ఏకపక్షమంటూ ప్రధానమంత్రికి ఘాటైన లేఖ రాశారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా జివోఎంకు స్పందించలేదు. తాము విభజనకు అనుకూలంగా ఉన్న జివోఎంను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ ముందే చెప్పింది. బిజెపి ఈ నెల 7వ తేదీ వరకు సమయం కోరింది. తెలంగాణ రాష్ట్ర సమితి ప్యాకేజీ, డిమాండ్లతో కూడిన నివేదికను ఇచ్చింది.
కాంగ్రెస్
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇరు ప్రాంతాల నాయకులు సమర్పించిన నివేదికలను పంపించారు. అధికార కాంగ్రెసు పార్టీ మరోసారి రెండు పడవల మీత కాలు వేసింది. అయితే సిడబ్ల్యూసి నిర్ణయమే అంతిమం.
బిజెపి
తాము ఇచ్చే నివేదిక పైన భారతీయ జనతా పార్టీ రెండు రోజుల సమయం కోరింది. తెలంగాణకు అనుకూలంగా ఉన్న బిజెపి సీమాంధ్రకు చెందిన డిమాండ్లను అందులో ప్రస్తావించనుంది. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని చెప్పనుంది.
టిడిపి
కాంగ్రెసు, కేంద్రం ఏకపక్షంగా విభజనపై నిర్ణయం తీసుకుందని, తాము జివోఎంను బహిష్కరిస్తున్నట్లు టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రధానికి బాబు ఘాటైన లేఖ రాశారు.
టిఆర్ఎస్
తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణకు భారీ ప్యాకేజీ, డిమాండ్లతో కూడిన నివేదికను రెండు రోజుల క్రితం జివోఎంకు పంపించింది. సమైక్య రాష్ట్రంలో తమ ప్రాంతం నష్టపోయిందని కాబట్టి తమకు నాలుగున్నర లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేసింది.
వైయస్సార్ కాంగ్రెసు
సమైక్య వాదాన్ని ఎత్తుకున్న వైయస్సార్ కాంగ్రెసు జివోఎంను బహిష్కరించింది. జివోఎం విభజనకు ఉద్దేశించింది కావడంతో దానిని బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ తెలిపింది.
సిపిఐ
తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని, అలాగే సీమాంధ్రకు న్యాయం చేయాలని సిపిఐ చెప్పింది. ప్రస్తుత సరిహద్దుల ప్రకారమే తెలంగాణ ఇవ్వాలని చెప్పింది.
సిపిఎం
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లేఖకు తాము స్పందించేది లేదని, తాము సమైక్యవాదం నుండి వెనక్కి తగ్గలేదని సిపిఎం చెప్పింది. రాఘవులు ప్రధానికి లేఖ రాశారు. అయితే తాము అఖిల పక్షానికి వెళ్లి సమైక్యవాదం వినిపిస్తామని చెప్పారు.
మజ్లిస్
మజ్లిస్ పార్టీ జివోఎంకు నివేదిక పంపింది. కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అయితే విభజనపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆ పార్టీ కేంద్రాన్ని కోరింది. అయితే తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని తెలిపింది.