టిడిపి బ్రహ్మాస్త్రం గురి తప్పిందా : ఆ నిధులు అందలేదు : మరి..టిడిపికి ఓట్లు పడ్డాయా ..!
ఎన్నికలు పూర్తయి రెండు వారాలు. ఇంకా ఓటరు నాడి అందక అభ్యర్దులు మల్లగుల్లాలు. పోలింగ్ తీరు పైన పోస్టు మార్టం..బయట పడుతున్న లోపాలు. ఏపిలో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతున్న టిడిపి నేతలకు కొత్త గుబులు పట్టుకుంది. టిడిపి ఆశలు పెట్టుకున్న ఆ నిధులు పూర్తి స్థాయిలో అందలేదనే సమాచారం పచ్చ శిబిరంలో కలకలం సృష్టిస్తోంది. దీంతో..ఇప్పుడు ఆ నిధులు ఏ మేర అందాయనే దాని పైన దృష్టి సారించారు. అయితే, విశ్లేషణలో అసలు విషయం బయట పడటంతో ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు.
టిడిపి ధీమాకు కారణం అదే..
ఈనెల 11న జరిగిన ఎన్నికల్లో పోలింగ్ సరళి పరిశీలిస్తే తమ గెలుపు ఖాయమని టిడిపి అధినేత చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. ఇదే సమయంలో వైసిపి అధినేత జగన్ సైతం తమకు లాండ్ స్లైడ్ విక్టరీ లభిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ క్యూ లైన్లలో పెద్ద ఎత్తున మహిళలు..వృద్దులు పాల్గొన్నారని వారంతా టిడిపికే పట్టం కట్టారని టిడిపి నేతలు చెబుతున్నారు. టిడిపి వ్యూహాత్మకంగా ఎన్నికల ముందుగానే మహిళలకు రెండో విడత పసుపు కుంకుమ నిధులు విడుదలకు చర్యలు తీసుకుంది. మూడు విడతల్లో నిధులు అందేలా పోస్ట్ డేట్ చెక్కులు ఇచ్చింది. ఫిబ్రవరి, మార్చిలో రెండు నెలల్లో రెండు విడతలుగా నగదు విడుదల చేసారు. ఇక, పోలింగ్ ముందుగా మూడో విడత నిధులు విడుదల చేయటం ద్వారా ఎన్నికల్లో తమకు లబ్ది జరుగుతుందని భావించి..సరిగ్గా అదే సమయంలో మహిళలకు పసుపు కుంకుమ తో పాటుగా అన్నదాత సుఖీభవ అదే విధంగా రైతు రుణ విముక్తి నాలుగో విడత నిధులను ఇచ్చేలా నిధులను ప్లాన్ చేసారు. అవి తమకు ఓట్లు సునామీ సృష్టిస్తాయని అంచనా వేసారు.
పూర్తి స్థాయిలో అందని నిధులు..
ఇక, పోలింగ్ ముందు పసుపు కుంకుమ నిధుల విడుదల కారణంగా..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 94 లక్షల మంది డ్వాక్రా మహిళలు తమకే ఓటు వేస్తారని టిడిపి నమ్మకం పెట్టుకుంది. అయితే, గ్రామీణ మహిళలు పూర్తిగా టిడిపికి ఓట్లు వేయలేదని గుర్తించారు. ఇక, తాజాగా పసుపు కుంకుమ మూడో విడత నిధులు అనేక జిల్లాల్లో బ్యాంకులు లబ్దిదారులకు ఇవ్వలేదని..బకాయిల కింద జమ వేసుకున్నారనే సమాచారం బయటకు వచ్చింది. టిడిపి మద్దతుగా నిలిచే మీడియా సైతం ఇది బ్యాంకుల వైఫల్యంగా చెప్పటంతో అభ్యర్దుల్లో మరింత టెన్షన్ పెరుగుతోంది. అదే విధంగా నాలుగేళ్లుగా అందిస్తున్న రైతు రుణ మాఫీ నిధులు సైతం కేవలం 500 కోట్లు మాత్రమే విడుదల అయ్యాయి. తమకు నిధులు మంజూరు చేయకోవటంతో తాము పూర్తి స్థాయిలో విడుదల చేయలేకపోయామని రైతు సాధికారిక సంస్థ చెబుతోంది. ఇక, అన్నదాత సుఖీభవ కింద 3000 మాత్రం నిధులు చాలా మంది రైతులకు జమ అయినట్లు అధికారులు చెబుతున్నారు.
ఎక్కడ ఉంది సమస్య...
ఎన్నికల ముందు పక్కా ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్లిన టిడిపికి ఈ సమస్య ఎక్కడ తలెత్తిందనే విషయం అంతు బట్టటం లేదు. టిడిపి అధినేత చంద్రబాబు తన ఎన్నికల ప్రచార సభల్లో నిధులు విడుదల చేస్తున్నామని అందరూ తీసుకోండి అంటూ ప్రచారం చేసారు. ఇక, పోలింగ్ రోజున ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు తమకే మద్దతుగా నిలిచారని టిడిపి నేతలు చెబుతూ వచ్చారు. ఇక, మహిళలు , వృద్దుల ఓట్లు గంపగుత్తగా తమకే వేసారని విశ్లేషించారు. టిడిపిని ఈ ఎన్నికల్లో పసుపు కుంకుమ నిలబెట్టిందని జెసి లాంటి వారు వ్యాఖ్యానించారు. అయితే క్షేత్ర స్థాయిలో నిధులు పూర్తి స్థాయిలో లబ్ది దారులకు చేరలేదనే సమాచారం మాత్రం టిడిపికి అంతుబట్టటం లేదు. ఏపి ప్రభుత్వం ఈ పధకం కింద విడుదల చేసిన నిధులను ఎక్కడా సర్దుబాటు చేయకుండా లబ్దిదారులకు అందచేయాలని అదేశించినా..బ్యాంకర్లు సహకరించలేదని చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు తాము నమ్ముకున్న బ్రహ్మస్త్రం గురి తప్పిందా అనే చర్చ టిడిపిలో మొదలైంది.