జనసేన టిక్కెట్ కోసం మాజీ మంత్రి బాలరాజు దరఖాస్తు, మీరూ పోటీ చేస్తారా.. చివరి తేది ఇదే
అమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం కోసం జనసేన పార్టీ స్క్రీనింగ్ కమిటీకి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. బుధవారం ఒక్క రోజే 170 బయోడేటాలు వచ్చాయి. గురువారం 150 వరకు వచ్చాయి. జనసేన పార్టీ నుంచి పోటీ చేసేందుకు పలువురు మాజీ మంత్రులు, కీలక నేతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. దరఖాస్తులను స్వీకరించిన స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తోంది.
జనసేన స్క్రీనింగ్ కమిటీకి బయోడేటా ఇచ్చిన మాజీ మంత్రి పసుపులేటి
ఇందులో భాగంగా, గురువారం మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కూడా దరఖాస్తు ఇచ్చారు. ఈయన కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేశారు. ఆయన పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకోసం తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించవలసిందిగా కోరుతూ బయోడేటాను ఇచ్చారు. అలాగే జనసేన నేతలు సీ పార్థసారథి, అద్దేపల్లి శ్రీధర్లు కూడా బయోడేటాలు ఇచ్చారు. గుంటూరు నుంచి ముస్లీం వైద్య దంపతులు ఇచ్చారు. గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, మదనపల్లె తదితర స్థానాల నుంచి అభ్యర్థిత్వం కోరుతూ ఎక్కువ మంది ముస్లీం నేతలు బయోడేటాలు ఇచ్చారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనికుడు కూడా స్క్రీనింగ్ కమిటీకి బయోడేటా ఇచ్చారు.
25వ తేదీన తుది గడువు
కాగా, జనసేన అభ్యర్థిత్వం కోరుతూ ఆశావహుల నుంచి వస్తున్న బయోడేటాల స్వీకరణకు తుది గడువును ఈ నెల 25వ తేదీని నిర్ణయించినట్లు స్క్రీనింగ్ కమిటీ ప్రకటించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు జనసేన తరఫున బరిలోకి నిలవాలనుకునే వారి నుంచి గత వారం నుంచి బయోడేటాలు తీసుకుంటున్నారు.
ఎక్కువ మంది ఆశావహులు
బుధవారం ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల నుంచి ఎక్కువ మంది ఆశావహులు దరఖాస్తులు ఇచ్చారు. ఇందులో వైద్య వృత్తిలో ఉన్న యువకులు కూడా ఉన్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల నుంచి పోటీకి ఆసక్తి కనబరుస్తూ పలువురు విద్యావంతులు వచ్చారు. స్థానికంగా రాజకీయ, సామాజిక రంగాల కుటుంబ నేపథ్యం ఉన్న గృహిణిలు జనసేన తరఫున బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.












Click it and Unblock the Notifications