ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: జగన్ పార్టీ నేతలపై పత్తిపాటి
గుంటూరు: అధికారం రాలేదన్న అక్కసుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలపై మండిపడ్డారు. శుక్రవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు.
రబీలో పంట విస్తీర్ణాన్ని పెంచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రస్తుత పంటలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని, రబీలో అన్ని రకాల విత్తనాలు సబ్సిడీకి అందిస్తామన్నాని ఆయన అన్నారు.
ఈనెల11, 12 తేదీలలో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, రైతుల శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోందని పుల్లారావు పేర్కొన్నారు.

కాంగ్రెసుకు గిరాకీ పెరిగింది...
కాంగ్రెస్ పార్టీకి గిరాకీ బాగా పెరిగిందని ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి చెప్పారు. 2019 నాటికి కాంగ్రెస్ బలమైన పార్టీగా తయారు కావాలని కోరారు. విజయవాడలో జరిగిన పీసీసీ సర్వసభ్య సమావేశంలో రఘువీరారెడ్డి మాట్లాడారు. ప్రత్యేక హోదా పోరాటమే కాంగ్రెస్కు శ్రీరామరక్ష అని అన్నారు. ఉప్పు సత్యాగ్రహం తరహాలో మట్టి సత్యాగ్రహం చేపడతామని రఘువీరా వివరించారు.
చంద్రబాబు మాటలు నీటిమూటలే...
నెల్లూరు జిల్లాలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు, శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఎండిన పంటలను ఆయన శుక్రవారంనాడు పరిశీలించారు. నెల్లూరు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పట్టిసీమ నీళ్లు కృష్ణా జిల్లాకు, శ్రీశైలం నీళ్లు నెల్లూరు జిల్లాకు అని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మాటలు నీటి మూటలేనని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications