తెలంగాణకెందుకు, జగన్ సమర్థింపు: బాబు, దెబ్బలు తిని జైలుకెళ్లా
హైదరాబాద్: పట్టిసీమకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఎందుకని, వారు అనుమతి కావాలని డిమాండ్ చేస్తే.. వారిని సమర్థించే స్థాయికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం శాసన సభలో నిలదీశారు. సముద్రంలోకి వెళ్లే నీటిని మనం ఎందుకు వాడుకోవద్దని ప్రశ్నించారు.
బాబ్లీని అడ్డుకునేందుకు మహారాష్ట్ర వెళ్లి తాను లాఠీ దెబ్బలు తిన్నానని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను తొలిసారి జైలుకు వెళ్లానని చెప్పారు. పట్టిసీమ పైన ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నీరు చాలా సున్నితమైన అంశమన్నారు. నీటి కోసం జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల మధ్య యుద్ధాలు సాగుతున్నాయన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు రూ.10,451 కోట్లు కావాలన్నారు. ఈ నెల 16వ తేదీన పోలవరం అథారిటీ సమావేశం జరిగిందని చెప్పారు. 2005లో పోలవరం ప్రాజెక్టును ప్రారంభించారని, అది కాంట్రాక్టుల కోసమే ప్రారంభించారని ఆరోపించారు. వైసీపీ ధ్యాస అంతా కాల్వలు, కాసులు, టెండర్ల పైనే అన్నారు.
ఏడాదిలోపు పట్టిసీమను పూర్తి చేసి తీరుతామన్నారు. అవసరమైతే తాను ప్రాజెక్టు వద్ద పడుకుంటానని చెప్పారు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. పట్టిసీమకు అవసరమైన వాటిని అన్నింటినీ ఇచ్చామన్నారు. 2250 టీఎంసీల నీటిని వినియోగించేలా ప్రాజెక్టులను రూపకల్పన చేశామని చెప్పారు.

పట్టిసీమ ఆలోచన వచ్చి ఉంటే రాయలసీమకు ఎప్పుడో నీళ్లు అందేవి అన్నారు. పట్టిసీమను వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టి ఉంటే రాయలసీమ కరవు రహిత ప్రాంతంగా మారేదన్నారు. పట్టిసీమ ఆలోచన వచ్చి ఉంటే తొమ్మిదేళ్లు సీమకు నీళ్లు వచ్చి ఉండేవన్నారు. పాలేగాళ్ల వ్యవస్థ కొనసాగించాలన్నదే విపక్షాల లక్ష్యమన్నారు.
కృష్ణా జలాల మిగులు నీరు వినియోగం మన హక్కు అన్నారు. తెలుగు గంగ ద్వారా మిగులు జలాలను వినియోగంలోకి తెచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావే అన్నారు. పట్టిసీమ టెండర్లలో నిబంధనలు పక్కాగా ఉన్నాయన్నారు. తమ వినతి మేరకే పోలవరం ఆర్డినెన్స్ను ప్రధాని తొలి కేంద్రమంత్రివర్గంలో తెచ్చారన్నారు.
జూలైలో గోదావరిలో, అక్టోబర్లో కృష్ణాలో వరదలు వస్తాయని, 273 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చునని చెప్పారు. రాయలసీమలో 1500 మీటర్ల లోతు వరకు నీరు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1500 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంటే రెండు మూడేళ్లు కరువు వచ్చినా తట్టుకోగలమన్నారు. ఎంత వరదలు వచ్చినా తట్టుకునే శక్తి ఏపీకి ఉందన్నారు.
పోలవరం నూటికి నూరుశాతం పూర్తవుతుందన్నారు. పోలవరంపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామన్నారు. ఎవరు అడ్డు వచ్చినా తోటపల్లి, హంద్రీనీవా గాలేరు, నగరి, పట్టిసీమలు పూర్తి చేస్తామన్నారు. మూడు నదులను అనుసంధానం చేస్తే సీమకు కరువు ఉండదన్నారు.
పర్సెంటీజీల పైనే జగన్ ధ్యాస: దేవినేని
వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ధ్యాస అంతా పర్సెంటీజీల పైనే అని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. కమీషన్లు, కలెక్షన్ల పైనే వారి దృష్టి అన్నారు. తమకు నీళ్లు కనిపిస్తే, వారికి పర్సెంటీజీలు కనిపిస్తాయన్నారు. జలయజ్ఞంలో ధన యజ్ఞానికి వారసుడు జగనే అని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications