పవన్ జగన్ ను ఫాలో అయ్యారు, చంద్రబాబు మళ్లీ పిలుస్తున్నారు: విజయమ్మ వ్యాఖ్యల కలకలం
జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై వైసిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 120 సీట్ల వరకు గెలుస్తారని చెబుతున్న విజయమ్మ..పవన్ ఏం చేసారని ప్రశ్నిస్తున్నారు. మూడున్నారేళ్లు ఏమీ మాట్లాడని పవన్..ఇప్పుడు తిట్టీ..తిట్టనట్లుగా ముఖ్యమంత్రి - లోకేష్ విషయంలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
పవన్ చేసిందేముంది...
వైసిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటుగా జనసేన అధినేత పవన్ కళ్యాన్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూ లో అసలు పవన్ కళ్యాన్ ప్రజలకు ఏం చేసారని ప్రశ్నించారు. 2014 ఎన్నికల సమయంలో టిడిపికి వేటేయించి..మూడున్నారేళ్లు ఏమీ మాట్లాడ లేదని విమర్శించారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్ ఏ సమస్య మీదైనా వెళ్తుంటే..ఆ విషయం తెలుసుకొని ముందుగా అక్కడికి వెళ్లటం మినహా పవన్ చేసిందేముందని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ అర్దం చేసుకుంటున్నారని ఎవరి శక్తి సామర్ధ్యాలేంటో ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. ఇక, ఏడాది కాలంగా ముఖ్యమంత్రి..లోకేష్ లపై విమర్శలు చేస్తున్న పవన్ వారిని తిట్టీ తిట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
అప్పుడు పిల్ల కాంగ్రెస్..ఇప్పుడు మోదీ
2014 ఎన్నికల్లో చంద్రబాబు కు మోదీ హవా తో పాటుగా పవన్ కళ్యాన్ కలిసి వచ్చారని విజయమ్మ విశ్లేషించారు. అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాజధాని నిర్మిస్తారని అందరూ భావించారని..అయితే తాత్కాలిక నిర్మాణాలు మినహా రాజధానిలో చేసిందేమీ లేదని విమర్శించారు. ఏ ఒక్క హామీ చంద్రబాబు అమలు చేయలేదని దుయ్య బట్టారు. అప్పుడు వైసిపి ని పిల్ల కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ తో జత కట్టారని..ఇప్పుడు మోదీకి మిత్రుడుగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ పై తొలి అవిశ్వాసం ఇచ్చిన పార్టీ వైసిపి అని విజయమ్మ గుర్తు చేసారు. 13 రోజుల పాటు అవిశ్వాసం కోసం పోరాడారని వివరించారు. అప్పుడూ..ఇప్పుడూ జగన్ ప్రజల్లోనే ఉన్నారని.. తాను అధికారంలోకి వచ్చిన తరువాత హామీలు అమలు చేయకపోతే..తానే రాజీనామా చేసి వెళ్లిపోతానని జగన్ ధైర్యంగా చెప్పారని విజయమ్మ చెప్పుకొచ్చారు.
పవన్ ను చంద్రబాబు పిలుస్తున్నారు..
పవన్ కళ్యాన్ టిడిపిని తిట్టీ తిట్టనట్టుగా వ్యవహరిస్తుంటే..ఇప్పుడు మరోసారి చంద్రబాబు తన తో కలిసి రావాలంటూ పవన్ ను పిలుస్తున్నారని విజయమ్మ వ్యాఖ్యానించారు. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా.. ఎవరి ఓట్లు ఎవరు చీల్చి నా.. ఈ సారి వైసిపి అధికారంలోకి రావటం ఖాయమని విజయమ్మ ధీమా వ్యక్తం చేసారు. 30 ఏళ్లు అధికారంలో ఉండా లనే జగన్ లక్ష్యం పైనా విజయమ్మ స్పందించారు. అధికారం కోసం పాకులాడటం తమ కుటుంబం లో లేదని.. ప్రజల కోసం తపన పడటమే జగన్ కు తెలుసని వివరించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు 120 సీట్ల వరకు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.