అమరావతిపై పవన్ స్టాండ్ మారిందా - తాజా వ్యాఖ్యలతో: చంద్రబాబుకు ఇరకాటం..!!
Pawan Kalyan:పవన్ కల్యాణ్ అమరావతి రైతులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పటం గ్రామ ప్రజలకు మద్దతుగా నిలిచిన పవన్..వారితో అమరావతి రైతుల పోరాటాన్ని పోల్చారు. ఒక గ్రామ ప్రజల సమస్యను గ్రామాల రైతులు చేస్తున్న పోరాటం తో పోల్చుతూ మాట్లాడారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు రాజధాని అమరావతిలోనే కొనసాగాలని కోరుతూ మూడేళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇప్పటం ప్రజలు చూపించిన తెగింపు..తెగువ అమరావతి రైతులు చూపి ఉంటే రాజధాని ఇక్కడ నుంచి కదిలేది కాదని పవన్ వ్యాఖ్యానించారు. దీని ద్వారా పవన్ ఏం చెప్పదలచుకున్నారనేది ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణమవుతోంది.

ఇప్పటం ప్రజలు - అమరావతి రైతులు
ఇప్పటం గ్రామంలో ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా ఇళ్లు కూల్చివేసిందనేది పవన్ ఆరోపణ. ప్రభుత్వం - అధికారులు ఆక్రమణల తొలిగింపు పైన ముందుగానే నోటీసులు ఇచ్చి..ప్రహరీలు మాత్రమే కూల్చామని చెబుతున్నారు. హైకోర్టులో తొలుత తమకు నోటీసులు ఇవ్వలేదని చెప్పిన ఇప్పటంలోని కొందరు గ్రామస్తులు కూల్చివేత పైన స్టే ఉత్తర్వులు పొందారు. ఆ తరువాత కోర్టు విచారణలో భాగంగా నోటీసులు వచ్చారని అంగీకరించారు. దీంతో, ఆగ్రహించిన న్యాయస్థానం పిటీషనర్లకు లక్ష చొప్పున జరిమానా విధించింది. అప్పటికే ఇప్పటంలో కూల్చివేతలతో నష్టపోయిన వారికి లక్ష రూపాయాల చొప్పున పవన్ ఆర్దిక సాయం ప్రకటించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఇప్పటం గ్రామానికి చెందిన 39 మందికి ఆర్దిక సాయం అందించారు. అదే సమయంలో చేసిన ప్రసంగంలో ఇప్పటం - అమరావతి రైతుల పోరాటంను పోల్చుతూ వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు అవే వ్యాఖ్యల పైన విశ్లేషణలు మొదలయ్యాయి.

తెగింపు - తెగువ గురించి పవన్ ప్రస్తావన
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు రాజధాని కోసం తమ భూములను ఇచ్చారు. జగన్ సీఎం అయిన తరువాత మూడు రాజధానుల నిర్ణయం తెర మీదకు వచ్చింది. దీనిని నిరసిస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న పోరాటం ఈ నెల 18వ తేదీకి మూడేళ్లు పూర్తవుతుంది. గతంలో పవన్ కల్యాణ్ సైతం అమరావతి గ్రామాల్లో పర్యటించి వారికి మద్దతు ప్రకటించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ, ఇప్పుడు ఇప్పటంలో వారి సొంత ఇళ్ల నిర్మాణాల ప్రహరీల కూల్చివేతలో ఆ గ్రామస్తులు చేసిన పోరాటాన్ని..రాష్ట్ర రాజధాని కోసం భూములు త్యాగం చేసి పోరాటం చేస్తున్న రైతులతో ముడి పెట్టి వ్యాఖ్యలు చేయటమే ఇప్పుడు ఈ చర్చకు కారణమవుతోంది. అమరావతి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం యాత్ర నిర్వహించారు. ఇప్పుడు అరసవల్లికి ప్రారంభించిన యాత్ర మధ్యలో ఆగిపోయింది. ఢిల్లీలో నిరసనలకు సిద్దం అవుతున్నారు.

మూడేళ్లుగా పోరాటం..పవన్ వ్యాఖ్యలతో
అమరావతి కోసం రైతులు చేసిన నిరసనల్లో పోలీసుల ఆంక్షలు..కొన్ని సందర్భాల్లో నిర్బంధాలు - లాఠీల దెబ్బలు తిన్నారు. కానీ, ఇప్పటంలో ఆ పరిస్థితి లేదు. ఇప్పటం గ్రామస్థులకు మద్దతుగా నిలవటం పైన అభ్యంతరం లేదు. కానీ..పవన్ ఇప్పటం ప్రజల తెగువను ప్రశంసిస్తూ..ఇదే విధంగా అమరావతి రైతులు చూపి ఉంటే రాజధాని కదిలేదని కాదంటూ వ్యాఖ్యానించటమే ఈ చర్చకు కారణమవుతోంది. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటుంటే..ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ అమరావతికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఇప్పుడు అమరావతికి మద్దతుగా అన్ని పార్టీలకు ఏకతాటి పైకి తెచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో అమరావతి రైతుల తెగింపు - తెగువకు సంబంధించి పవన్ చేసిన వ్యాఖ్యలతో కొత్త చర్చలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications