అప్రమత్తంగా ఉండండి - జనసేన నేతలకు ఢిల్లీ వర్గాల హెచ్చరిక..!!
వైసీపీ ప్రభుత్వం పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. పార్టీ పీఏసీ సమావేశంలో విశాఖలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో విధ్వంసం చేయాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. అందులో భాగంగానే ఈ నెల 15న జనసేన పైన ఆంక్షలు పెట్టారని విమర్శించారు. అక్కడి ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఘర్షణలు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. వివాదాలు సృష్టించి కల్లోలాలు రేపాలని ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఆరోపించారు. వైసీపీ తీరుకు చెప్పు చూపించక ఏం చూపించాలని ప్రశ్నించారు.
పెద్ద స్థాయి అధికారులు కూడా వంగి వంగి సలాం చేస్తుంటే చెప్పు చూపించక ఏం చూపించాలని ప్రశ్నించారు. జనసేన అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. తన విశాఖ పర్యటనలో ప్రభుత్వం చేయబోయే విధ్వంసం పై అయిదు రోజుల ముందే కొందరు శ్రేయోభిలాషులు..సన్నిహితుల ద్వారా సమాచారం అందిందని పవన్ కళ్యాణ్ వివరించారు. భయపడి ఇంట్లో ఉంటే ఎలా అని తెగించి విశాఖలో అడుగు పెట్టామని చెప్పుకొచ్చారు. విశాఖలో అక్రమ అరెస్టులు.. మనలో సమన్వయాన్ని పెంచాయని, ఇదే స్పూర్తితో ఉత్తరాంధ్ర ప్రజల సమస్యల పైన పోరాటం చేయాలని పవన్ పిలుపునిచ్చారు. విశాఖలో జరిగిన పరిణామాలపై విలేకరుల సమావేశంలో జనసేనాని పై కుట్ర పేరుతో వీడియో ప్రదర్శన చేసారు.

పవన్ పర్యటనలో కుట్ర గురించి కొన్ని మార్గాల ద్వారా ముందే తెలుసుకున్న ఢిల్లీ వర్గాలు..అప్రమత్తంగా ఉండాలని జనసేన నాయకత్వాన్ని హెచ్చరించాయని చెప్పుకొచ్చారు. తుని రైలు దహనంతో పాటుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న అనేక ఘటనల్లో వైసీపీ ప్రమేయం ఉందని వీడియోలో వివరించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వమని గతంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నామని పార్టీ నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అవసరమైతే తామే చొరవ తీసుకొని అందరినీ కలుస్తామని చెప్పుకొచ్చారు. 26 జిల్లాల్లో జనవాణి సభలు నిర్వహిస్తామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications