వైయస్ వల్లే తెలంగాణ: పవన్, పౌరుషం చూపాలి: బాబు
గుంటూరు/కడప: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే తెలంగాణ ఉద్యమం పుట్టిందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఆయన ఆదివారం గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. టిడిపి, బిజెపి కూటమి గెలుపు కోసమే తాను పోటీలో లేనని చెప్పారు. ప్రశ్నించడానికే జనసేన పార్టీ అన్నారు. గుడివాడలో రావి వెంకటేశ్వర రావును గెలిపించాలన్నారు. వేల కోట్లు తిన్న జగన్ సిఎం పదవికి అనర్హుడన్నారు.
సీమాంధ్ర ప్రజలపై అవాకులు చవాకులు మాట్లాడిన కెసిఆర్ను ఏనాడూ ప్రశ్నించని జగన్ సిఎం కాలేరన్నారు. తెలుగుజాతి ఐక్యతను జగన్ దెబ్బతీశారన్నారు. సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే చూస్తూ ఊరుకోలేక, కడపు మండి, గుండె రగిలి తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందన్నారు. 2014 ఎన్నికలు తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేవన్నారు.

పరిపాలనలో అనుభవమున్న చంద్రబాబును గెలిపించాలని పిలుపునిచ్చారు. నూరు గొడ్లు తిన్న రాబందు ఒక గాలి వానకు చచ్చిపోతుందని, జగన్ అవినీతితో వేలకోట్లు దోపిడీ చేసి రాజకీయాలు చేస్తున్నారన్నారు. జగన్ సిఎం అయితే రాష్ట్రాన్ని దోచుకుంటాడన్నారు.
పౌరుషాన్ని చూపండి: చంద్రబాబు
ఈసారి ఎన్నికల్లో సీమ పౌరుషాన్ని చూపాలని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాంగ్రెసు నేతలు దొరికింది దోచుకుంటారన్నారు. అవినీతిపరులను మట్టి కరిపించాలన్నారు. చంద్రబాబు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. సీమాంధ్రను సోనియా దెబ్బతీశారన్నారు. జగన్ను గెలిపిస్తే మరింత దోచుకుంటారన్నారు. తెలుగు జాతి పరిరక్షణకు అందరం ఒక్కటవుదామన్నారు.
రాష్ట్రంలోని ముస్లింలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, కడపలో హజ్ హౌస్ను నిర్మిస్తామన్నారు. మత్స్యకారులకు, చేనేత కార్మికులకు రూ.2 లక్షలతో ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. అమ్మాయిలకు సెల్ఫోన్లను ఇస్తామని, రైతులకు రుణ మాఫీ చేస్తామని చెప్పారు. ఎన్నికల తర్వాత తాను బయట ఉంటానని, జగన్ జైళ్లో ఉంటాడన్నారు. కడప జిల్లాలో వైయస్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు.












Click it and Unblock the Notifications