ప్రాణాలమీద ఆశలు వదిలేశా, డ్రోన్లతో నిఘా, లగడపాటి నాతో చెప్పారు: పవన్ కళ్యాణ్

చింతలపూడి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల మాట్లాడుతూ తనకు ప్రాణహానీ ఉంటే భద్రత కల్పిస్తామని చెప్పారని, తాను రాజకీయాల్లోకి వచ్చేటప్పుడే ప్రాణాల మీద ఆశలు వదిలేశానని, తనపై దాడులు చేసేందుకు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రజాస్వామ్య, హింసాత్మక పోరాటానికి తాను సిద్ధమన్నారు.

ఇందులో ఏది కావాలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంపిక చేసుకోవాలని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తనకు నలుగురు భద్రతా సిబ్బందిని కేటాయించిందని, వారిని తిరస్కరించానని చెప్పారు. అందులో ఒకరు తన సమాచారాన్ని ముఖ్యమంత్రికి చేరవేసేవారని చెప్పారు. పవన్ చింతలపూడి బహిరంగ సభతో పాటు పలువురితో భేటీ అయిన సందర్భంగా మాట్లాడారు.

రాత్రి కొందరు దాడి చేశారు

గతంలో ప్రభుత్వం తనకు రక్షణ కల్పించిందని, ప్రస్తుతం దాడులు జరుగుతాయని తెలిసినా ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, రెండు రోజుల కిందట నేను బస చేసిన కల్యాణ మండపం వద్ద రాత్రివేళ కొందరు గొడవ చేశారని, ఆ సమయంలో ఒక్క పోలీసు కూడా లేరని, దాడి చేసేందుకు వచ్చిన వారిపై ప్రతి దాడి చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యమా అని పవన్ ప్రశ్నించారు. శాంతిభద్రతలు ఎలా దిగజారాయో డీజీపీ పునరాలోచించాలన్నారు.

నన్ను ఎలా కాపాడుకోవాలో తెలుసు

తాను చంద్రబాబుకు చెప్పేది ఒక్కటేనని, తనకు సెక్యూరిటీ అవసరం లేదని, నన్ను నేను ఎలా రక్షించుకోవాలో తెలుసునని, మొన్న రాత్రి కల్యాణ మండపం వద్ద కొందరు యువకులు గొడవ చేసిన సమయంలో ఫిర్యాదు తీసుకునేందుకే స్థానిక ఎస్సై నిరాకరించారని పవన్ ఆరోపించారు. పైఅధికారులు చెబితే గాని స్పందించలేదన్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉందన్నారు.

నేనేమైనా దోపిడీదారునా?

తన వద్ద ఏం నిఘా సమాచారం ఉంటుందని, నేను దోపిడీదారునా? మోసగాడినా? అని పవన్‌ ప్రశ్నించారు. ఏలూరులో తాను రెస్ట్ తీసుకుంటుండగా 30మంది వచ్చి తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారన్నారు. మహిళా ఎమ్మెల్యే పీతల సుజాత నియోజకవర్గంలో జిల్లాకు చెందిన మరొక ఎమ్మెల్యే చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. రౌడీయిజం చేసే ఎమ్మెల్యేలను చంద్రబాబు ఎందుకు భర్తరఫ్‌ చేయడం లేదని నిలదీశారు.

మా సహకారం లేకుండా జగన్, బాబు ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు

వచ్చే ఎన్నికలలో జనసేన సహకారం లేకుండా టీడీపీ, వైసీపీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని పవన్ అన్నారు. ప్రతి ఒక్కరికీ అండగా ఉండే ప్రభుత్వాన్ని స్థాపిస్తామన్నారు. 2019-24 మధ్య దేశ రాజకీయాల్లో సమూల మార్పులు రానున్నాయని, సరికొత్త నాయకత్వం రానుందన్నారు. ఏపీలోను కర్ణాటక తరహాలో మూడు పార్టీల మధ్య పోటీ ఉంటుందని, భాగస్వామ్య ప్రభుత్వం అనివార్యమన్నారు. జనసేనకు అయిదు, ఆరు సీట్లు వస్తాయా? అని ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారని, ఎన్ని సీట్లు వచ్చినా తమ మద్దతు లేకుండా ప్రభుత్వాలు ఏర్పాటుకాబోవన్నారు. 2019 ఎన్నికలలో జనసేన కీలకం కానుందని, వైసీపీ, టీడీపీలు మన మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తనతో చెప్పారన్నారు. ప్రస్తుతం రెండు పార్టీలతో సమదూరంలో ఉన్నామన్నారు.

డ్రోన్లతో జనసేన కార్యాలయంపై నిఘా

జనసేన కార్యాలయంపై డ్రోన్‌లతో నిఘా పెట్టారని పవన్ ఆరోపించారు. హింసాత్మక రాజకీయాలకు పాల్పడితే ఊరుకోమని దెబ్బకు దెబ్బ తీస్తామని హెచ్చరించారు. జనసేన జెండా పట్టుకుంటే బూట్లతో తొక్కిస్తారా అని ప్రశ్నించారు. పోలీసులను పంపించి, 30 మందితో దాడి చేయించడమే మీ అనుభవమా చంద్రబాబు గారు అన్నారు. అందరినీ గుర్తు పెట్టుకుంటామని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+