తమాషాలా, బాబూ! డ్రామా ఆపు: ఊగిపోయిన పవన్, మోడీ-ట్రంప్తో పోల్చుకొని..
Recommended Video
విశాఖపట్నం: చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం హెచ్చరికలు జారీ చేశారు. ఖబడ్దార్, తమాషాగా ఉందా, పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే చూస్తూ కూర్చుంటానా అని ఊగిపోయారు. ఆయన విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గంలోని ముదుపాక సభలో మాట్లాడారు.
టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు కూడా చట్టానికి అతీతులు కాదన్నారు. భూకబ్జాలు ఉండవద్దని, ఉత్తరాంధ్రకు అండగా ఉంటారని తాను టీడీపీకి మద్దతిచ్చానని చెప్పారు. దళితతేజం అని మాట్లాడే టీడీపీ ప్రభుత్వం వారి భూములు లాక్కుంటారని మండిపడ్డారు. సామాన్యుల భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకుంటామా అన్నారు.
బాబూ! డ్రామాలు వద్దు, రైల్వే జోన్కు అడ్డుపడిందే మీరు
విశాఖ రైల్వే జోన్కు అడ్డుపడిందే టీడీపీ ఎంపీలు రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్లు అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారన్నారు. ముదుపాకలో కనీసం ఓ డిగ్రీ కాలేజీ కూడా పెట్టలేకపోయారని విమర్శించారు. తాము జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్పారు. పెందుర్తి నియోజకవర్గంలోనే ఎంతో భూమి లాక్కున్నారన్నారు. రైతులకు అండగా ఉంటామని చెప్పి, ఇప్పుడు దోచుకుంటారా అన్నారు.
పవన్కు దాడి షాకిచ్చారా?: చంద్రబాబూ! మీఅద్భుతాలు చాలు, మోడీకి చెప్పగా విన్నాను
తమాషాగా ఉందా?
తమాషాగా ఉందా అని పవన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎవరినైనా బెదిరించారనుకుంటే ఖబడ్దార్ అన్నారు. పిచ్చిపిచ్చి వేషాల వేస్తే ప్రజాక్షేత్రంలో నిలదీసే పరిస్థితిని నేను తీసుకు వస్తానని చెప్పారు. దాడులు చేస్తే, బెదిరిస్తే ప్రజా ఉద్యమాలు ఎలా వస్తాయో చూపిస్తామని ఊగిపోయారు. నిలదీస్తే చంపేస్తాం, బెదిరిస్తాం, కేసులు పెడతామంటే ఊరుకునేది లేదన్నారు. సామాన్యుడి చిహ్నం కాబట్టి తాను ఎరుపు కండువా వేసుకున్నానని చెప్పారు.
చంద్రబాబూ! కనిపించడం లేదా?
మీకు అధికారం, డబ్బులు ఉంటే మా వద్ద సామాన్యుడి గుండెచప్పుడు ఎరుపు కండువా ఉందన్నారు. మీరు పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోవడానికి పార్టీ పెట్టలేదన్నారు. మీ ఎమ్మెల్యేల దోపిడీ, మీ టీడీపీ నేతల దోపిడీ చంద్రబాబుకు కనిపించడం లేదా అని పవన్ మండిపడ్డారు. జనసేనకి బలం ఎక్కడుందని కొంతమంది ప్రశ్నించారని, ఇంతమంది ఇక్కడకు వచ్చారని, ఇది మన బలం కాకపోతే మరేంటో చెప్పాలన్నారు. మొదట కొందరు జనసేన అయిదు సీట్లు గెలుచుకుంటుందన్నారి, జనసేనకి ఒక్క శాతం మాత్రమే ఓట్లు వస్తాయని అన్నారని విమర్శించారు.
మోడీ, ట్రంప్లతో పోల్చుకున్న జనసేనాని
మళ్లీ ఇటీవల జనసేనకి పది శాతం ఓట్లు వస్తాయని అంటున్నారని పవన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా పది శాతం ఓట్లతో ప్రారంభించారని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పది శాతం ఓట్లతోనే ప్రారంభించారన్నారు. పది శాతంతో ప్రారంభించిన వారు ఒకరు భారత ప్రధాని అయ్యారని, ఒకరు అమెరికా అధ్యక్షుడయ్యారని, మేము కూడా జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామన్నారు. ఎంతో మంది నిరుద్యోగ యువత ఉన్నారని, వారందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలన్నారు. వైసీపీ నాయకులు ప్రజలకు అండగా ఉండకుండా తమ నాయకుడిని ముఖ్యమంత్రిని చేయండని, ప్రజల సమస్యలు తీరుస్తామంటున్నారన్నారు.
ఉత్తరాంధ్ర మేధావులతో భేటీ
అంతకుముందు, పవన్ ఉత్తరాంధ్ర మేధావులతో భేటీ అయ్యారు. అనంతరం ట్వీట్ చేశారు. తాను ఉత్తరాంధ్ర మేధావులతో చర్చించానని తెలుపుతూ ట్వీట్లు చేశారు. 'వనరులు మావా? అభివృద్ధి వాళ్లకా (పాలక వర్గాలకా?)... కుటుంబాలు బాగుపడుతున్నాయి కానీ కులాలు బాగుపడట్లేదు' అనే రెండు అంశాలు ఈ భేటీ ద్వారా తెలిశాయని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర వెనకబాటుదనంపై పోరాడే క్రమంలో మేధావులతో జరిపిన చర్చ తన నిబద్ధతను మరింత పెంచిందన్నారు.