అమ్మకు జనసేన నీరాజనం.. యావత్ దేశానికే లోటు అన్న పవన్
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జయలలితకు సంతాపాన్ని ప్రకటిస్తూ.. పార్టీ తరుపున ఒక నోట్ ను విడుదల చేశారు.
హైదరాబాద్ : మూడు దశాబ్దాలకు పైగా తమిళ రాజకీయాలను శాసించిన పురుచ్చితలైవి.. ఇక శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. నాటకీయ పరిణామాల నడుమ ఆమె చివరి రోజులు తమిళ ప్రజలకు, అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. వారి ప్రార్థనలు, వైద్యుల ప్రయత్నాలేవి ఆమెను బ్రతికించలేకపోయాయి. చివరికి సోమవారం 11.30గం.ల సమయంలో అమ్మ ఈ లోకాన్ని వీడిపోయినట్లుగా అపోలో వైద్యులు అధికారిక ప్రకటన చేశారు.
ప్రస్తుతం అమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రధాని మోడీ సహా దేశవ్యాప్త ప్రముఖులంతా చెన్నైకి తరలుతుండగా.. సామాజిక మాధ్యమాల్లో, మీడియా ద్వారా అమ్మకు పలువురు నాయకులు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జయలలితకు సంతాపాన్ని ప్రకటిస్తూ.. పార్టీ తరుపున ఒక నోట్ ను విడుదల చేశారు.
తమిళరాజకీయాలను శాసించన మహిళా నాయకురాలిగా జయలలితను కొనియాడిన పవన్.. ఆమె మరణం యావత్ భారతానికే తీవ్ర లోటుగా పేర్కొన్నారు. అమ్మ ప్రవేశపెట్టిన పలు పథకాలు అనుసరణీయమంటూ ప్రశంసించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా జీవించిన జయలలితకు తన తరుపున పార్టీ తరుపున అంజలి ఘటిస్తున్నాని సంతాపం వ్యక్తం చేశారు.