ఎందుకు ఊరుకున్నావ్, నిజాలు తేలుతాయి: బాబుకు పవన్ కళ్యాణ్ షాక్, ఇద్దరికీ డెడ్లైన్
హైదరాబాద్/అమరావతి: జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్తో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఇన్నాళ్లు కేంద్రం నిధులు ఇవ్వకుంటే టీడీపీ ప్రభత్వం ఏం చేస్తుందని మీరు ప్రశ్నించారని, మరి మీరేం చేశారని ఓ విలేకరి ప్రశ్నించగా.. అన్యాయం జరిగిన విషయం తన దృష్టికి ఎవరైనా తెస్తే కదా తాను ప్రశ్నించేది అన్నారు.
అందుకే సంయమనం పాటించానని చెప్పారు. తాను మిత్రపక్షాల వైపు కాదని, ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటానని పవన్ కళ్యాణ్ చెప్పారు. తెలంగాణ ఏర్పడటానికి విభజన జరిగిందని, తెలంగాణకు జరగాల్సిన న్యాయం (విభజన వరకు) న్యాయం జరిగిందని, ఇప్పుడు ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోవాలని పవన్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి అనుకూలంగా వస్తున్నానన్న విమర్శలపై తాను స్పందించనని, అది వారి ఆలోచన అని పవన్ చెప్పారు. ఉండవల్లి రాజకీయ సన్యాసం చేశారని, అలాంటి వారే ప్రజల కోసం ఆలోచిస్తారని చెప్పారు.తనతో కలిసి వచ్చే వారి జాబితా ఒకటి రెండు రోజుల్లో ఇస్తానని చెప్పారు.

హోదాపై అందరిలా నేను బాధపడుతున్నా
ఏపీకి ఇచ్చిన నిధుల విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న మాటలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏపీకి మేలు జరుగుతుందనే తాను 2014 ఎన్నికల సమయంలో టీడీపీ - బీజేపీకి మద్దతు పలికానని చెప్పారు. ప్రత్యేక హోదా అమలు చేయకపోవడంతో అందరిలా తాను కూడా బాధపడుతున్నానని, అసంతృప్తితో ఉన్నానని అసహనం వ్యక్తం చేశారు.

చంద్రబాబు ఇన్నాళ్లు ఎందుకు ఊరుకున్నారు
రాష్ట్ర విభజన హామీలు నెరవేరకపోవడంతో తాను రెండుమూడు సభలు కూడా పెట్టానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రత్యేక హోదా పైన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ మాటల్లో వ్యత్యాసం కనిపిస్తోందన్నారు. ఈ రెండు పార్టీలు మాట మార్చాయని విమర్శించారు. కేంద్రం నిధులపై ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఇన్నాళ్లు ఎందుకు ఊరుకుందని ప్రశ్నించారు.

పోలవరంపై శ్వేతపత్రం అడిగితే ఇవ్వలేదు
ఏపీకి విభజన హామీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇన్నాళ్లు జాప్యం చేసిందని పవన్ విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాలేదని ఇప్పుడు చెప్పడం ఏమిటని అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు వచ్చాయని, దానిపై తాను శ్వేతపత్రం అడిగానని, అది ఇవ్వలేదని చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శించారు.

నాకు నిధుల వివరాలు ఇవ్వండి
కేంద్రం నిధులు తక్కువగా ఇచ్చిందని టీడీపీ అంటోందని, ఆ నిధులకు జాబితాను తనకు ఇవ్వాలని పవన్ ఏపీ ప్రభుత్వాన్ని అడిగారు. ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఇచ్చామని చెబుతున్న బీజేపీ కూడా అలాగే చేయాలన్నారు. ఆర్థికవేత్తలు, విద్యావేత్తలతో కలిసి ఓ జేఏసీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇరువర్గాలు చెబుతున్న దానిని బట్టి నిధుల విషయంలో ఒకవైపు తప్పు ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు.

అడిగిన వివరాలు ఇవ్వకుంటే ఆ తర్వాత చూస్తాం
పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన నిధులపై తమకు వివరాలు ఇవ్వాలని అడిగామని, ఇవ్వకుంటే వారి ఇష్టమని చెప్పారు. వారికి 15వ తేదీ వరకు డెడ్ లైన్ పెడుతున్నామని, అప్పటికీ ఇవ్వకుంటే ఆ తర్వాత ఏం చేయాలో చూస్తామన్నారు. ప్రస్తుతానికి జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ నిధుల విషయమై చూస్తుందన్నారు. తన వంతు కృషి తాను చేస్తానని, ఇవ్వడం, ఇవ్వకపోవడం వారిష్టమన్నారు.

ఎవరిది నిజమో తేలుతుంది
పార్లమెంటులో ఎంపీలు డ్రామాలు ఆడుతున్నారని కొందరు విమర్శలు చేస్తున్నారని అడగ్గా.. వారి బాడీ లాంగ్వేజ్ను చూసి తాను ఏదీ చెప్పలేదు కదా అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆర్థికవేత్తలు, మేధావులు, విద్యావేత్తలతో కలిసి విభజన హామీలపై జేఏసీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీజేపీ, టీడీపీలు చెబుతున్న వాటిపై జేఏసీలో చర్చిస్తామని, అప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరిది నిజమో తేలుతుందన్నారు. తమది జేఏసీ కాదని, వాస్తవాలు నిర్ధారించే కమిటి అన్నారు.












Click it and Unblock the Notifications