కీలక నియోజకవర్గంలో అభ్యర్దిని ప్రకటించిన పవన్ కల్యాణ్..!!
ఏపీలో ఎన్నికలకు పార్టీలు సిద్దం అవుతున్నాయి. అభ్యర్దుల ఖరారు ప్రక్రియ వేగవంతం చేసాయి. పొత్తలతో పాటుగా టీడీపీ కూటమిలో మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాల పైన ఒక నిర్ణయానికి వచ్చాయి. ఇక, జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలు ఖరారు చేసారు. అందులో అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలకు పవన్ తన అభ్యర్దులను ప్రకటించారు. మిగిలిన 19 స్థానాల్లో ఒక స్థానం పైన తాజాగా స్పష్టత ఇస్తూ తమ అభ్యర్ది పైన ప్రకటన చేసారు.
మరో అభ్యర్ది ప్రకటన
జనసేన వచ్చే ఎన్నికల్లో మొత్తం 24 స్థానాల్లో పోటీ చేయనుంది. అందులో పవన్ ఇప్పటికే నెల్లిమర్ల, రాజానగరం, తెనాలి, కాకినాడ రూరల్, అనకాపల్లి స్థానాల్లో తమ అభ్యర్దులను ప్రకటించారు. రాజమండ్రి రూరల్ స్థానం కూడా జనసేనకు వెళ్తుందని ప్రచారం జరిగింది. దీంతో, అక్కడ టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆందోళన వ్యక్తం చేసారు. పార్టీలోని బుచ్చయ్య లాంటి సీనియర్ కు సీటు లేకపోతే ప్రతికూల సంకేతాలు వెళ్తాయని భావించారు. ఫలితంగా రాజమండ్రి రూరల్ నుంచి సీటు ఆశించిన కందుల దుర్గేష్ కు ఇప్పుడు నిడుదవోలు సీటు ఖరారు చేస్తూ పవన్ నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం కందుల దుర్గేష్ కు రాజమండ్రి సీటు కోసం ఆయన అనుచర వర్గం ఆందోళనకు దిగింది. దీంతో, దుర్గేష్ ను నిడుదవోలు నుంచి పోటీ చేయాలని పవన్ సూచించారు.

నిడుదవోలు నుంచి దుర్గేష్
కందుల దుర్గేష్ ఈ సీటు నుంచి గెలుపు అవకాశాల పైన అనుచర వర్గంతో చర్చించారు. పవన్ సూచన మేరకు నిడుదవోలులో పోటీ చేసేందుకు అంగీకరించారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి గతంలో ఇక్కడ రెండు సార్లు వరుసగా గెలిచిన బూరుగుపల్లి శేషారావు సీటు పైన ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ఆయన అనుచర వర్గం నిడుదవోలు నుంచి టీడీపీ రాష్ట్ర కార్యాలయం వరకు ర్యాలీ చేసారు. శేషారావుకు సీటు ఇవ్వాలని డిమాండ్ చేసారు. మరో వైపు బీజేపీ, జనసేన నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. పొత్తులో భాగంగా జనసేన - బీజేపీకి 8 ఎంపీ, 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. జనసేన తాజా ప్రకటనతో మొత్తం ఆరు స్థానాలకు అభ్యర్దులను ఖరారు చేసింది. మిగిలిన ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల పైన ఈ చర్చల్లో స్పష్టత రానుంది.
ఏ సీటులో ఎవరు పోటీ
ఇక, ఇప్పుడు నిడుదవోలు నుంచి కందుల దుర్గేష్ పేరు ప్రకటించటంతో శేషారావు నిర్ణయం ఏంటనేది చూడాలి. శేషారావుతో టీడీపీ ముఖ్య నేతలు మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సీటు ప్రకటనతో జనసేన తమకు కేటాయించిన స్థానాల్లో మరో 18 చోట్ల తమ అభ్యర్దులను ప్రకటించాల్సి ఉంది. ఇక.. ఎంపీ స్థానాల్లో అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం తొలుత జనసేనకు కేటాయించారు. ఇప్పుడు అనకాపల్లి స్థానం బీజేపీకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో, రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయనుంది. పవన్ కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ రోజు మూడు పార్టీల చర్చల్లో భాగంగా ఏ పార్టీ ఏ స్థానం నుంచి పోటీ చేస్తుందనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications