రాష్ట్ర వ్యాప్తంగా పవన్ బస్సు యాత్ర - ముహూర్తం ఫిక్స్ : ఆరు నెలలు ప్రజల్లోనే..!!
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఫీవర్ కొనసాగుతోంది. ఇప్పటికే అధికార వైసీపీ ఇంటింటికీ ప్రభుత్వం కొనసాగిస్తుండగా.. చంద్రబాబు ఈ నెల 15వ తేదీ నుంచి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పర్యటనకు సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో...జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తొలి సారిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో మమేకం కావాలని నిర్ణయించారు. అందులో భాగంగా బస్సు యాత్రకు డిసైడ్ అయ్యారు. దీనికి దసరా ముహూర్తంగా ఫిక్స్ చేసారు

దసరా నుంచి పవన్ బస్సు యాత్ర
అక్టోబర్ 5వ తేదీన తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆరు నెలల పాటు రాష్ట్రమంతా పర్యటించి.. ప్రతీ ఉమ్మడి జిల్లాలో బహిరంగ సభలో పాల్గొంటారు. దీనికి సంబంధించి షెడ్యూల్ కు తుది రూపు ఇస్తున్నారు. ఇప్పటికే పొత్తుల పైన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో వేడి పెంచిన పవన్ కళ్యాణ్.. తన పర్యటనల ద్వారా పార్టీలో జోష్ పెంచటంతో పాటుగా తన సత్తా చాటేందుకు సిద్దమయ్యారు. 2024లో జరగాల్సిన ఎన్నికలు ఏడాది ముందుగానే 2023 మార్చి - ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉంటాయంటూ మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

టార్గెట్ సీఎం జగన్ .. ప్రభుత్వాన్ని లక్ష్యంగా
ముఖ్యమంత్రి జగన్.. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా పవన్ కల్యాణ్ తన ప్రచారంలో ఫోకస్ చేయనున్నారు. పొత్తుల పైన మూడు ప్రత్యామ్నాయాలు సూచించిన పవన్.. బీజేపీ తో పాటుగా టీడీపీ నుంచి క్లారిటీ వచ్చిన తరువాత పొత్తుల అంశం పైన తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. బీజేపీతో తెగ తెంపులు చేసుకోకుండానే... తన ప్రజాబలం ఏంటో నిరూపించుకోవాలని పవన్ భావిస్తున్నారు. అయితే, అటు చంద్రబాబు - ఇటు పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన తో వైసీపీ పైన ఒత్తిడి పెరగనుంది. మొత్తం 26 జిల్లాలను కవర్ చేస్తూ ఆరు నెలల పాటు పూర్తిగా ప్రజలతోనే ఉండాలని జనసేనాని నిర్ణయం తీసుకున్నారు.

పొత్తులపై ఒత్తిడి పెంచటం.. ప్రజల్లోనే ఉండటం
ఇప్పటికే మెగా ఫ్యాన్స్ సైతం జనసేనకు మద్దతుగా ఉంటామని ప్రకటించటం.. పవన్ పొత్తుల పైన వ్యాఖ్యలు చేయటం..ఇప్పుడు బస్సు యాత్రకు డిసైడ్ అవ్వటంతో జనసేన ఈ సారి ఎన్నికలకు సీరియస్ గానే సిద్దం అవుతున్నట్లు స్పష్టం అవుతోంది. పవన్ బస్సు యాత్ర సక్సెస్ చేయటం ద్వారా పొత్తుల కోసం వచ్చే పార్టీల పైన ఒత్తిడి ఉంటుంది. ఇదే సమయంలో.. పవన్ తాను అధికారంలోకి వస్తే ఏం చేయబోయేదీ.. తన ప్రాధాన్యతలు ఈ యాత్ర సమయంలోనే స్పష్టం చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో..సీఎం జగన్ ను రాజకీయంగా లక్ష్యంగా చేసుకొని ముందుకు కదులుతున్న పవన్..యాత్రకు ఎటువంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications