పవన్ కళ్యాణ్ లేఖ రాలేదంటున్న కేంద్రం - నేడు "ఉక్కు" దీక్ష - మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారా..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉక్కు దీక్షకు సిద్దమయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ..నిర్వాసితుల సమస్యల పైన పవన్ ఈ దీక్ష చేపడుతున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన పీఏసీ నేతలతో సహా..జిల్లాల నుంచి వచ్చిన నేతలు జనసేన అధినేత కు మద్దతుగా దీక్షలో పొల్గొంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించాలని కేంద్రం నిర్ణయించింది. స్టీల్ ప్లాంట్ లో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడిని ఉప సంహించుకోనున్నట్లు ప్రకటించింది.
300 రోజులుగా కార్మికుల అందోళన
దీని పైన 300 రోజులకుగా పైగా కేంద్ర నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని కోరుతూ కార్మికులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం మాత్రం తమ నిర్ణయం నుంచి వెనక్కు వెళ్లేది లేదని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి జగన్ ..ప్రతిపక్ష నేత చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాసారు. ఇదే సమయంలో విశాఖ ఉక్కువిషయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్తో జరిపిన ఉత్తర, ప్రత్యుత్తరాల విషయంలో ప్రధాన సమాచార కమిషనర్ వద్ద ఉన్న రికార్డులలో ఎటువంటి సమాచారం లేదని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.
పవన్ లేఖ అందలేదంటున్న కేంద్రం
విశాఖ ఉక్కు కర్మాగారం పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లకు ఇచ్చిన ప్రత్యుత్తరాలపై సమాచారం కావాలని విజయవాడకు చెందిన ఇనగంటి రవికుమార్ సమాచార హక్కు చట్టం కింద గత నవంబర్లో కేంద్ర ఆర్థిక శాఖను కోరారు. ఈ అంశంలో సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అప్పటి సహాయమంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్ బదులిచ్చారని ఆ శాఖ అండర్ సెక్రటరీ పేర్కొన్నారు.
సీఎం జగన్ - చంద్రబాబు లేఖలు
ఇక, విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావంగా జరిగిన సభలో పవన్ కళ్మాణ్ ఏపీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసారు. అన్ని పక్షాలను ఢిల్లీ తీసుకెళ్లాలని డిమాండ్ చేసారు. అందు కోసం ఏపీ ప్రభుత్వానికి వారం రోజుల సమయం నిర్దేశించారు. కానీ, ఏపీ ప్రభుత్వం పవన్ అల్టిమేటం ను పట్టించుకోలేదు. ఇక, ఈ రోజున పవన్ కళ్యాన్ పార్టీ నేతలతో కలిసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు దీక్షచేయనున్నారు.
పవన్ టార్గెట్ ఎవరు
కేంద్రం తీసుకున్న నిర్ణయం పైన పోరడటానికి తనకు ఎటువంటి ఇబ్బంది లేదని విశాఖ సభలో పవన్ చెప్పుకొచ్చారు. ఇక, ఈ రోజు చేసే దీక్ష ద్వారా పవన్ ఎవరిని లక్ష్యంగా చేసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది. నిర్ణయం తీసుకున్న కేంద్రం నిర్ణయం తో విభేదిస్తారా లేక, సహజ శైలిలో జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది. ఈ రోజు దీక్ష ప్రారంభంలో.. ముగింపులోనూ పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు.