పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్: ఎమ్మెల్యేలను అదుపులో ఉంచుకుంటారా.. లేద ప్రజలే ఆపని చేయమంటారా?
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని తీరు మారకుంటే ప్రజలే ఆయనకు బుద్ధి చెప్తారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం ఏలూరులోని క్రాంతి కళ్యాణ మండపంలో ఆయన ఆలిండియా దళిత హక్కుల నేతలు హమాలీలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రభుత్వ అధికారులపై దాడి చేయడం, పోలీసులను తుపాకీలతో బెదిరించడం, తాజాగా ఏలూరు లిక్కర్ డిపోలో మాట వినలేదని దళిత కార్మికుడిని కులం పేరుతో దూషించి దాడి చేయడం చూస్తుంటే ఆయన ప్రభుత్వం యంత్రాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నట్లుగా కనిపిస్తోందని ధ్వజమెత్తారు పవన్ కళ్యాణ్. ఇదే వేదికపై చింతమనేని ప్రభాకర్ తనపై దాడి చేసిన విధానాన్ని పవన్ కళ్యాణ్కు వివరించాడు బాధితుడు.
Recommended Video
సామాన్యుడికి భద్రతతో కూడిన పాలన అందిస్తారని, శాంతి భద్రతల విభాగాన్ని బలోపేతం చేసి అధికారులతో సక్రమంగా పనిచేయిస్తారన్న నమ్మకంతోనే 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చినట్లు చెప్పారు పవన్ కళ్యాణ్. బెదిరింపులు, దౌర్జన్యాన్ని చూస్తుంటే చింతమనేని వ్యవహార శైలి రౌడీ షీటర్ను తలపిస్తోందన్నారు. ఇప్పటికే 37 కేసులు చింతమనేనిపై ఉన్నాయని తాజా ఘటనతో కేసుల సంఖ్య 38కి చేరుకుందని పవన్ గుర్తుచేశారు.
మనది ప్రజాస్వామ్య దేశం అని చింతమనేని మరిచినట్లున్నారని అందుకే రాచరికంలా నడుచుకుంటున్నారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. ఓవైపు దళిత తేజం అంటూ ముఖ్యమంత్రి ప్రచారం చేసుకుంటుండగా.. మరోవైపు అతని సొంత ఎమ్మెల్యేలే కులాల పేరుతో దూషించి దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ చింతమనేనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని పవన్ డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు తన ఎమ్మెల్యేలను క్రమశిక్షణలో పెట్టుకోకపోతే ఆ బాధ్యతను ప్రజలే తీసుకుంటారని హెచ్చరించారు. "మీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారా..? లేక ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో చూస్తారా..?" అంటూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని నిలదీశారు.