మేస్త్రీ కుటుంబానికి పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం: కేంద్రానికి వినతి
అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా ఉపాధి లేక ఆత్మహత్యకు పాల్పడిన నాగ బ్రహ్మాజీ అనే కార్మికుడి కుటుంబానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉపాధి లేకనే తాపీ మేస్త్రీ నాగ బ్రహ్మాజీ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఇకనైన ప్రభుత్వం కళ్లు తెరవాలని అన్నారు.
నాగ బ్రహ్మాజీ ఆత్మహత్య రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల ధీనస్థితికి అద్దంపడుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్థ ఇసుక పాలసీ కారణంగా ప్రత్యక్షంగా రాష్ట్రంలోని 19.6లక్షల మంది కార్మికులు, పరోక్షంగా 10లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
The suicide of ‘Mr. Naga brahmaji’ reflects the grim situation of construction workers in the state of AP; due to ‘chaotic sand policy’ of AP govt has put 19.6 lakh workers directly & another one million workers indirectly out of job & put their families in a state of misery.
— Pawan Kalyan (@PawanKalyan) October 27, 2019
ఇసుక లభించకపోవడంతో ఉపాధి లేక దిక్కుతోచని స్థితిలో కార్మిక కుటుంబాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని సుమారు 30లక్షల కార్మికుల వేదనను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ఏపీ సర్కారు ఇసుక పాలసీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అంతేగాక, నవంబర్ 3న భవన కార్మికులకు మద్దతుగా విశాఖలో భారీ ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించారు కూడా.
ప్రభుత్వ పరిపాలన తీరు చాలా బాధ కలిగిస్తోందన్నారు. ప్రజల సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. దొంగల్లాగా.. ఇసుక ఆన్లైన్ బుకింగ్ అర్ధరాత్రి పూటే ఎందుకని ప్రశ్నించారు. నిమిషాల వ్యవధిలోనే ఇసుక దొరకకుండా పోతోందన్నారు. ఇసుక సరఫరా పునరుద్ధరణ జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు పవన్ కళ్యాణ్.
రాష్ట్రంలో ఇసుక కొరత సమస్యతో లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని, ఇది తనను ఎంతో బాధకు గురిచేస్తోందని పవన్ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కారు కొత్త ఉద్యోగాలు ఇవ్వాలి గానీ ఉన్న ఉద్యోగాలను తీసేయకూడదని అన్నారు. ఇసుకను ఆపేయడం ఎంతోమంది జీవితాలు అస్తవ్యస్తమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.