ఆయనే నాకు ప్రేరణ: పవన్ కల్యాణ్ కళ్లు చెదిరే డొనేషన్
Pawan Kalyan: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్న వేళ.. జనసేన పార్టీకి భారీ విరాళం అందింది. దాని విలువ 10 కోట్ల రూపాయలు. ఈ మొత్తాన్ని అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా విరాళంగా ఇచ్చారు. 10 కోట్ల రూపాయల మొత్తంతో కూడిన చెక్ను పార్టీ కోశాధికారి రత్నం చేతికి అందించారు.
ఎన్నికల సమయంలో పార్టీ నిర్వహణ, ప్రచార వ్యవహారాలు.. ఇతరత్రా ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని పవన్ కల్యాణ్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపించడానికి అప్పట్లో ప్రముఖులు భారీగా విరాళాలను ఇచ్చే వారని, తాను వారి బాటలోనే నడిచానని అన్నారు. మోతీలాల్ నెహ్రూ ప్రేరణతో తన కష్టార్జితాన్ని పార్టీకి విరాళంగా ఇచ్చానని చెప్పుకొచ్చారు.

సినిమాల్లో నటించడం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఇలా పార్టీ ఫండ్గా అందజేశానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇది తొలిసారి కాదని, గతంలో నిర్వహణ అవసరాల కోసం ఎప్పటికప్పుడు తాను ఎంతో కొంత మొత్తాన్ని చెల్లించేవాడినని గుర్తు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని నడపడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని వ్యాఖ్యానించారు.
పార్టీ నిర్వహణ కోసం చిరుద్యోగులు, చిరు వ్యాపారులు, దినసరి వేతన కార్మికులు, వ్యవసాయ కూలీలు చాలామంది విరాళాలను అందజేశారని అన్నారు. అలాంటి చిన్నా, చితక వ్యాపారులే తమ కష్టార్జితాన్ని పార్టీకి చెల్లిస్తున్నారని, తన వంతుగా 10 కోట్ల రూపాయలను ఇచ్చానని చెప్పారు.

అయిదారు సంవత్సరాల కాలంలో 40 నుంచి 50 కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టానని పవన్ కల్యాణ్ అన్నారు. అందుకే ఇప్పుడు తన ఆదాయం నుంచి 10 కోట్ల రూపాయలను పార్టీకి విరాళంగా ఇచ్చానని వివరించారు.
పార్టీ నిర్వహణ అవసరాలకు రూ.10 కోట్ల స్వార్జితాన్ని విరాళంగా అందించిన శ్రీ పవన్ కల్యాణ్ గారు pic.twitter.com/6DSmi00fJn
— JanaSena Party (@JanaSenaParty) March 26, 2024












Click it and Unblock the Notifications