పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్: జగన్పైకి నెట్టేసిన నారాయణ
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూసేకరణ జరుపుతున్న తీరుపై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ప్రభావం తీవ్రంగా పడినట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా, అనుకూలంగా మాట్లాడుతున్నారా అనేది తేల్చుకోలేక వారు సతమవుతున్నట్లు కనిపిస్తున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తన వాదనకు ఓ ట్విస్ట్ ఇచ్చారు.
రైతులందరూ భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే అర్థం వచ్చే విధంగా సమస్య జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వల్లనే వస్తుందనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందినవారు మాత్రమే భూములు ఇవ్వడం లేదని, అది రాజకీయమైందే గానీ రైతులు వ్యతిరేకంగా ఉండడం కాదనేది ఆయన మాటల్లోని ఆంతర్యంగా కనిపిస్తోంది.

భూసేకరణ విషయంలో నారాయణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రీత్యా తాజాగా శుక్రవారంనాడు ఓ ప్రకటన చేశారు. 2018 జూన్ నాటికి రాజధాని మొదటిదశ పనులు పూర్తి చేస్తామని నారాయణ తెలిపారు. శుక్రవారం జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఉండవల్లి పరిసర ప్రాంతాల్లోని రైతులకు ఎక్కువమొత్తంలో ప్యాకేజీ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారని నారాయణ వెల్లడించారు. ఉండవల్లి గ్రామ రైతులు ఎక్కువ ప్యాకేజీ అడుగుతున్నారని పవన్ కళ్యాణ్ అన్న మాటకు ఇది జవాబుగా కనిపిస్తోంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన వారే భూములు ఇవ్వడానికి నిరాకరించారని, మిగిలిన రైతులంగా సంతోషంగా తమ భూములిచ్చారని అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎనిమిదివేల ఎకరాల్లో మాత్రమే భవనాలు నిర్మిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. మిగతా భూమిలో రైతుల వాటా, మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. సంతోషంగా ఉన్న రైతుల్లో అపోహలు పెంచడం సరికాదన్నారు. చేతనైతే రాజధాని నిర్మాణానికి సహకరించాలని కోరారు.
బలవంతంగా లాక్కోలేదు: చినరాజప్ప
రైతుల వద్ద నుంచి భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కోలేదని, రైతులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చారని రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప అన్నారు. ప్రభుత్వం బలవంతంగా భూ సేకరణ చేస్తే 33 వేల ఎకరాలు ఎలా సేకరించగల్గుతుందని ఆయన ప్రతిపక్షనేతను ప్రశ్నించారు. రాజధాని విషయంలో జగన్ అసెంబ్లీలో ఏమీ మాట్లాడక పోవడమే మంచిదన్నారు.












Click it and Unblock the Notifications