ఖమ్మం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పవన్ కళ్యాణ్ అభిమాని చిన్నారి శ్రీజ
హైదరాబాద్: బ్రెయిన్ ఫీవర్ తో బాధపడుతున్న పవన్ కల్యాణ్ అభిమాని చిన్నారి శ్రీజ పూర్తిగా కోలుకుంది. దీంతో ఖమ్మంలోని కార్తీక్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందిన చిన్నారి శ్రీజను గురువారం డాక్టర్లు డిశ్చార్జి చేశారు. కుటుంబ సభ్యలు ఆమెను పాల్వంచ తీసుకెళ్లారు.
చిన్నారి శ్రీజ చివరి కోరికను మేక్ ఎ విష్ ఫౌండేషన్ ద్వారా తెలుసుకున్న సినీ హీరో పవన్ కళ్యాణ్ అక్టోబర్ 17న ఆసుపత్రికి వచ్చి పరామర్శించిన విషయం తెలిసిందే. ఆమె కోలుకోవడంతో పవన్ అభిమానులు ఆసుపత్రిలో స్వీట్లు పంచిపెట్టారు.
ఇటీవలే ఆస్పత్రిలోనే 13వ పుట్టినరోజు వేడుక చేసుకుంది. అక్టోబర్ 2న ఆమె ప్రాణాపాయ స్థితిలో వచ్చిందని.. ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడిందని, మరికొంత కోలుకున్నాక ఈ వారంలోనే డిశ్చార్జ్ చేస్తామని.. చిన్నారి శ్రీజకు వైద్యం చేస్తున్న కార్తీక్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ అసాధారణ్ తెలిపిన విషయం విదితమే.
ఈ సందర్భంగా శ్రీజ కూడా మాట్లాడింది. ‘నా పేరు శ్రీజ. నేను పాల్వంచ డీఏవీ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను' అని చెప్పింది. చిన్నారి శ్రీజ కోలుకోవడంలో డాక్టర్ అసాధారణ్, సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు.
‘శ్రీజా.. నేను పవన్ కళ్యాణ్ని వచ్చాను లేమ్మా'.. అక్టోబర్ 17న ఆమెవద్దకు వచ్చిన పవన్కల్యాణ్ పలకరించారు. ఆ రోజు అరగంట శ్రీజ వద్దే కూర్చున్న పవన్ కళ్యాణ్ ఒకదశలో కంటతడిపెట్టడం తెలిసిందే. ఆ చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చి.. శ్రీజ తప్పకుండా కోలుకుంటుందని, ఆ విషయం తెలిపితే మళ్లీ వస్తానని వారికి భరోసా ఇచ్చారు.