రోడ్లు మీరు వేయరు? వేస్తామంటూ వచ్చినవారిపై కేసులు పెడతారా?: ఏపీ సర్కారుపై పవన్ కళ్యాణ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా మారాయంటూ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. జనసేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా చేపట్టారు. తాజాగా, ట్విట్టర్ వేదికగా మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించారు పవన్ కళ్యాణ్.
'అమ్మపెట్టదు, అడుక్కు తిననివ్వదు' అంటూ వైసీపీ సర్కారుపై పవన్ కళ్యాణ్ తనదైన శైలీలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, కడప జిల్లాలోనే రోడ్ల పరిస్థతి దారుణంగా మారిందని గత కొన్ని రోజులుగా తన వాదన వినిపిస్తూ వస్తోన్న పవన్ కళ్యాణ్ తాజాగా మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు.

హైదరాబాద్ హైదర్షాకోట్ దగ్గర ఉండే కాట్నం బాలగంగాధర్ ప్రమాదాల నివారణ కోసం రోడ్లను బాగు చేసే పని స్వచ్ఛందంగా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఈయన దేశంలోని చాలా చోట్ల తన సొంత డబ్బుతో ఇప్పటి వరకు 2100 గుంతలను పూడ్చారు. అందుకే ఈయనను రోడ్ డాక్టర్గా పిలుచుకుంటారు.
కాగా, బాలగంగాధర్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోనూ రహదారి గుంతలను పూడ్చేందుకు వెళ్లాడు. ఈ సమయంలోనే అక్కడి పోలీసులు తనపై కేసులు పెడతామంటూ వేధిస్తున్నారని బాలగంగాధర్ తాజాగా ఆరోపించారు. ప్రస్తుతం ఇదే విషయాన్ని ప్రస్తావించిన పవన్.. 'వైసీపీ ప్రభుత్వం రోడ్లను బాగు చేయడం లేదు.. అలాగే సొంతంగా రోడ్లను బాగు చేస్తానని ముందుకు వచ్చిన వ్యక్తిని వేధిస్తున్నారు' అని, అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
ఇక రోడ్ల కోసం వసూలు చేస్తున్న ట్యాక్స్లు ఏమయ్యాయని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. చిన్న గోతులను పెద్దవిగా, పెద్ద గోతులను కాలువలుగా మార్చి రోడ్ల అభివృద్ధిలో ప్రభుత్వం నిజంగానే అద్భుతం చేసిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అస్తవ్యస్తమైన రోడ్ల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంతలు పడిన దారులని, ప్రయాణించడానికి వీలు కాని దుస్థితిలో ఉన్న రోడ్లను వీడియోలు, ఫోటోలు తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జనసేన పార్టీ వినూత్న నిరసనలకు దిగింది. రోడ్లను మరమ్మతులు చేయాలని జగన్ సర్కార్ మీద ఒత్తిడి తెస్తోంది. ఒకవేళ సర్కార్ రోడ్ల మరమ్మత్తు చేయకుంటే గాంధీ జయంతి రోజున తామే శ్రమదానం చేసి రోడ్లు బాగు చేసేందుకు రంగంలోకి దిగుతామని జనసేన హెచ్చరికలు జారీ చేసింది.
ఇది ఇలావుండగా, వినాయక ఉత్సవాలపై ఆంక్షలు విధించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ప్రభుత్వం వెంటనే ఆంక్షల్ని ఉపసంహరించుకోవాలని సూచించారు. మత విశ్వాసాలకు ప్రతీక అయిన వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు విధించడంపై పునరాలోచన చేయాలన్నారు. దేవాలయాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకి అనుమతివ్వాలన్నారు.
కరోనా నిబంధనల పేరుతో వినాయక చవితి ఉత్సవాలకు వర్తింపజేయడం ఎందుకని జనసేనాని ప్రశ్నించారు. వైసీపీ కార్యక్రమాలకు కరోనా నిబంధనలు అడ్డురావా? సంస్మరణ సభకు కరోనా లేదా? అని నిలదీశారు. విపక్షాలు నిరసనలు చేస్తే కరోనా కేసులా? అంటూ మండిపడ్డారు. మిగతా రాష్ట్రాల్లో స్వేచ్ఛగా అనుమతులు ఇచ్చారని.. ఏపీలో ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని పవన్ ప్రశ్నించారు. వెంటనే వినాయక చవితి వేడుకలకు అనుమతి ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు. కాగా, ప్రైవేట్ స్థలాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకునేందుకు ఏపీ హైకోర్టు అనుమతిచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications