అవునా...జగన్ టూర్ ను పవన్ వెంటాడుతున్నాడా?...వైసిపిలో అనుమానాలు...
వైసిపి అధ్యక్షడు జగన్మోహన్ రెడ్డిని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఫాలో అవుతున్నారా? లేక వెంటాడుతున్నారా?...రెండింటి అర్థం ఒకటే అయినా దాని భావం వేరుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుందనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఏదేమైనా... ఏపిలో పవన్ టూరు ప్రోగ్రాంను గమనిస్తే వైసిపిలో అదే అనుమానాలు మొదలయ్యాయట....
జనసేన పార్టీ కార్యాలయం నుండి పవన్ సంతకంతో టూర్ ప్రోగ్రాం విడుదలైంది. 'ఛలోరే ఛలోరే ఛల్' అనే పేరుతో చేపట్టిన పవన్ టూర్ ఆంధ్ర ప్రదేశ్ లో ఇదే తొలి కార్యక్రమం కావటం గమనార్హం. తొలుత తన పర్యటనను తెలంగాణాలోని కరీంనగర్ జిల్లాలో మొదలుపెట్టిన పవన్ ఏపిలో మాత్రం అనంతపురం నుంచి ప్రారంభిస్తున్నాడు.

జగన్ దిశలోనే...పవన్ కూడా...
అయితే పవన్ ఈ టూర్ షెడ్యూల్ చూస్తే మొన్నటి ప్రజాసంకల్పయాత్రలో జగన్ యాత్ర సాగిన దిశలోనే సాగుతుండటం గమనార్హం. జగన్ కూడా తన అనంతపురం యాత్రను గుత్తి నియోజకవర్గంతోనే మొదలుపెట్టారు. తర్వాత ధర్మవరం, పుట్టపర్తి, కదిరి, తాడిపత్రి, రాప్తాడు తదితర నియోజకవర్గాల్లో పర్యటించారు. ఇపుడు పవన్ జిల్లా పర్యటన కూడా గుత్తితో మొదలై తర్వాత కదిరి, పుట్టపర్తి, ధర్మవరం నియోజకవర్గాల్లో పర్యటనతోనే ముగుస్తోంది.

ఒక్కటే...తేడా...
కాకపోతే జగన్ పాదయాత్ర కదిరి నుండి చిత్తూరు జిల్లాలోకి ఎంటరయింది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎపిలో తన తొలి ‘ఛలోరే ఛలోరే ఛల్' కార్యక్రమం తొలి విడత యాత్రను ధర్మవరంలో ముగించి...ఆ తరువాత నేరుగా హైదరాబాద్ కు వెళ్లిపోతున్నారు...జగన్-పవన్ యాత్రలకు అదే తేడా.

ఎపిలో...‘ఛలోరే ఛలోరే ఛల్'...తొలి రోజు...
పవన్ కల్యాణ్ ఏపి పర్యటన అనంతపురం జిల్లాతో శనివారం నుండి ప్రారంభమైంది. శనివారం నుంచి పవన్ మూడు రోజుల పాటు అనంతపురం జిల్లాలో బిజీ బిజీగా గడపనున్నారు. 27 మధ్యాహ్నం జిల్లా కేంద్రానికి చేరుకున్న పవన్ ముందుగా గుత్తిరోడ్డులో నిర్మించ తలపెట్టిన పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేశారు. అనంతరం గుత్తిరోడ్డులోని ఫంక్షన్ హాలులో ప్రజావేదికలో పాల్గొన్నారు.

పవన్...ఎపిలో..రెండో రోజు యాత్ర...
పవన్ ఎపి టూర్ లో రెండో రోజు...అంటే జనవరి 28వ తేదీన ఉదయం 11 గంటల ప్రాంతంలో కదిరికి చేరుకుంటారు. అక్కడ నరసింహస్వామి ఆలయంలో పూజలు చేసిన తర్వాత స్ధానికులతో సమావేశం అవుతారు. అక్కడి నుండి బయలుదేరి పుట్టపర్తికి వెళతారు. అక్కడ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో హనుమాన్ జంక్షన్ లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. పుట్టపర్తిలోని సత్యసాయి మందిరాన్ని, తర్వాత మంచినీటి పథకం, ఆస్పత్రిని సందర్శిస్తారు. 29 ఉదయం 10 గంటలకు ధర్మవరానికి చేరుకుంటారు. చేనేత కళాకారులతో సమావేశమవుతారు. ఆ తర్వాత అక్కడి నుండి బయలుదేరి హైదరాబాద్ కు చేరుకుంటారు....జగన్ పాదయాత్రకు మంచి స్పందన లభిస్తుండటంతో టిడిపి కావాలనే పవన్ ను జగన్ పర్యటనను ఫాలో అయ్యేలాగా కుట్ర చేస్తోందని వైసిపి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications